ఖిల్లాను కాపాడండి… కబ్జాలు ఆపండి..!
కరీంనగర్ కలెక్టర్కు మొలంగూర్ వాసుల వినతి
గ్రామానికి రావాల్సిందిగ వినూత్నంగా ఆహ్వాన పత్రిక
చారిత్రాత్మక ఖిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని అభ్యర్థన
పర్యాటక కేంద్రంగా మార్చాలని ప్రతిపాదన
కలెక్టర్ స్పందనపై గ్రామస్తుల ఆశలు
కాకతీయ, శంకరపట్నం : చారిత్రక ప్రాధాన్యత కలిగిన మొలంగూర్ ఖిల్లా అభివృద్ధి, గ్రామ భూసమస్యల పరిష్కారం కోసం గ్రామస్తులు మరోసారి కదిలారు. మండలంలోని మొలంగూర్ గ్రామానికి చెందిన ప్రజలు, తెలంగాణ జన సమితి నాయకులు కలిసి జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రకు ఆహ్వాన పత్రిక అందజేసి గ్రామ సమస్యలను వినిపించారు. ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని, గ్రామంలో పెరుగుతున్న భూకబ్జాలను అరికట్టాలని ప్రధానంగా కోరారు. తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు మోరే గణేష్, అధికార ప్రతినిధి భాను బాబు మాట్లాడుతూ మొలంగూర్ ఖిల్లా చారిత్రక, సాంస్కృతిక సంపదతో నిండిన కట్టడమని వివరించారు. ఖిల్లాలో హిందూ, ముస్లిం ప్రార్థనా మందిరాలు, కోనేరులు, దూద్ బావి, అఖండ దీపం, దుర్గా ఫిరంగులు వంటి అనేక విశేషాలు ఉన్నాయని, ఇవి పర్యాటకులను ఆకర్షించే సామర్థ్యం కలిగినవని తెలిపారు. సరైన ప్రణాళికతో అభివృద్ధి చేస్తే మొలంగూర్ రాష్ట్ర స్థాయి పర్యాటక కేంద్రంగా ఎదిగే అవకాశముందని పేర్కొన్నారు.

ఖిల్లా మార్గంలో భూమి కబ్జా…
ఖిల్లాకు వెళ్లే మార్గంలో ఉన్న సుమారు రెండు ఎకరాల 10 గుంటల ప్రభుత్వ భూమి అక్రమంగా ఆక్రమించబడిందని గ్రామస్తులు ఆరోపించారు. ఈ భూమిని కాపాడి ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలన్నారు. ముఖ్యంగా గ్రామానికి అవసరమైన కార్యాలయాలు, గ్రంథాలయాల నిర్మాణానికి ఈ భూమిని ఉపయోగించాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే సర్వే నంబర్ 703లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన ప్రభుత్వ భూములు కూడా ప్రమాదంలో ఉన్నాయని, వాటిని రక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు. గతంలో కలెక్టర్ పమేలా సత్పతి జోక్యంతో కొంత భూమిని రక్షించగలిగామని గుర్తు చేస్తూ, ఇప్పటికీ అదే స్థాయిలో చర్యలు తీసుకోవాలని కోరారు.
మిగులు భూములపై కన్నేసిన కబ్జాదారులు..!
మొలంగూర్ నుంచి వేరుపడి కొత్త గ్రామపంచాయతీగా ఏర్పడిన నల్ల వెంకయ్యపల్లి గ్రామానికి సంబంధించి సర్వే నంబర్లు 753, 754, 755లో ఉన్న ప్రభుత్వ భూములను అభివృద్ధి అవసరాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా సర్వే నంబర్ 661లో ఉన్న 15 ఎకరాల భూమిలో కొంత భాగం ఇప్పటికే కేటాయించబడినప్పటికీ, మిగిలిన భూమి కబ్జాకు గురవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలోని చెరువులు, కుంటలు కూడా ఆక్రమణలకు గురవుతున్నాయని పేర్కొంటూ, ఇది భవిష్యత్తులో నీటి సమస్యలకు దారితీస్తుందని హెచ్చరించారు. భూసంరక్షణపై తక్షణ చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత విషమిస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కలెక్టర్లు సరఫరాజ్ అహ్మద్, పోలీస్ కమిషనర్ కమలహాసన్, శశాంక్ మహంతి వంటి ఉన్నతాధికారులను ఆహ్వానించి ఖిల్లా పరిస్థితిని చూపించినప్పటికీ, అభివృద్ధి పనులు ముందుకు సాగలేదని వారు గుర్తు చేశారు. అధికారులు పర్యటనలకే పరిమితమై, స్థిరమైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత కలెక్టర్ చిత్ర మిశ్ర స్వయంగా గ్రామాన్ని సందర్శించి సమస్యలను పరిశీలించాలని, ఖిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని కోరారు. అలాగే ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను గుర్తించి తిరిగి స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


