నాలుగు దశాబ్దాల అనుబంధానికి ముగింపు
కాంగ్రెస్కు గుడ్బై చెప్పిన జీవన్ రెడ్డి
జగిత్యాల రాజకీయాల్లో సంచలనం
కాకతీయ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: జగిత్యాల జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.పార్టీకి దశాబ్దాలుగా కట్టుబడి పనిచేసిన మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.అభిమానులు, అనుచరులు, స్థానిక నాయకుల సమక్షంలో చేసిన ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.సుదీర్ఘ రాజకీయ ప్రయాణం, పార్టీతో అనుబంధం, కార్యకర్తల మద్దతు ఈ మూడు అంశాల మధ్యనే తన నిర్ణయం తీసుకున్నానని జీవన్ రెడ్డి తెలిపారు. సభలో మాట్లాడుతూనే పలుమార్లు భావోద్వేగానికి లోనైన ఆయన “నాలుగు దశాబ్దాలుగా పార్టీ కోసం అహర్నిశలు శ్రమించాను… కానీ నాకు దక్కింది అవమానమే” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.పార్టీ ప్రస్తుత దిశపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడం ఎందుకని ప్రశ్నించారు. ఈ చర్యల వల్ల కష్టపడి పనిచేసిన అసలు కాంగ్రెస్ కార్యకర్తలే నిరుత్సాహానికి గురవుతున్నారని వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయింపులు మంచివి కాదని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని గుర్తుచేశారు.జగిత్యాల రాజకీయ పరిణామాలపై కూడా ఆయన ఘాటు విమర్శలు చేశారు. స్థానిక కార్యకర్తల అభిప్రాయాలను పక్కనబెట్టి జగిత్యాల ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకోవడం బాధాకరమని దీంతో స్థానిక నేతల మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. “నాతో నడిచిన కార్యకర్తలకు కూడా న్యాయం చేయలేకపోయాను” అంటూ బాధ వ్యక్తం చేశారు.

రాష్ట్ర నాయకత్వంపై పరోక్ష వ్యాఖ్యలు చేసిన జీవన్ రెడ్డి రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ అంటూ రాజ్యాంగ విలువలను ముందుకు తీసుకెళ్తుంటే ఇక్కడ మాత్రం ఆ విలువలు కనిపించడం లేదు” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు పార్టీలో అంతర్గత విభేదాలను బహిర్గతం చేసినట్లయ్యాయి.ఎమ్మెల్యే సంజయ్ వ్యవహారంపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. “ప్రభుత్వంతో సమన్వయం వేరు… కానీ పార్టీ వ్యవహారాల్లో జోక్యం ఎందుకు?” అని ప్రశ్నించారు.పార్టీ వ్యవస్థను దెబ్బతీసే చర్యలు జరుగుతున్నాయని పరోక్షంగా విమర్శించారు.తన అనుచరుడి హత్య జరిగిన సమయంలో కూడా ముఖ్యమంత్రి స్పందించకపోవడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆరోపించారు.”ఓపికకు కూడా హద్దు ఉంటుంది… గత 20 నెలలుగా ఎన్నో అవమానాలను భరిస్తూ వచ్చాను” అంటూ తీవ్ర మనోవేదన వ్యక్తం చేశారు.చివరగా, “గౌరవం లేని చోట ఎలా పని చేయగలం?” అని ప్రశ్నిస్తూ పార్టీకి గుడ్బై చెప్పారు. అయితే పార్టీని వీడినా ఇందిరా గాంధీ ఆశయాలను గౌరవిస్తూ ప్రజా సేవలో కొనసాగుతానని స్పష్టం చేశారు.జీవన్ రెడ్డి రాజీనామాతో జగిత్యాల జిల్లా కాంగ్రెస్లో గంభీర ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఆయన వెంట పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వెళ్లే అవకాశముండగా ఆయన తదుపరి రాజకీయ అడుగు ఏంటన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర అంశంగా మారింది.


