గ్యాస్ సరఫరాలో అక్రమాలకు చెక్
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
కలెక్టర్ చిత్రా మిశ్రా
కాకతీయ, కరీంనగర్ : గ్యాస్ సరఫరా వ్యవస్థలో ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా హెచ్చరించారు. మంగళవారం సీతారాంపూర్లోని నిర్మల భారత్ గ్యాస్ ఏజెన్సీ గోదాములో ఆమె ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా గృహ, వాణిజ్య సిలిండర్ల బుకింగ్, స్టాక్ నిల్వలు, రోజువారీ సరఫరా వివరాలను పరిశీలించారు. సంబంధిత రిజిస్టర్లను తనిఖీ చేసి, ఆస్పత్రులు, వాణిజ్య సంస్థలు, గృహ వినియోగదారులకు జరుగుతున్న సరఫరా స్థితిగతులను ఆరా తీశారు.
డీలర్లు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా గ్యాస్ సరఫరా చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎటువంటి అక్రమాలు చోటుచేసుకున్నా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. గృహ వినియోగదారులకు సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. స్టాక్, బుకింగ్ వివరాలను నిరంతరం పౌరసరఫరాల శాఖకు నివేదించాలని డీలర్లకు సూచించారు.ఈ తనిఖీలలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మి కిరణ్, జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు పాల్గొన్నారు.


