హద్దు మీరుతున్న ఆర్ఎంపీ వైద్యం
ఆకునూరులో మెడికల్ మాఫియా బహిర్గతం
ప్రథమ చికిత్స పేరుతో ప్రాణాలపై ప్రయోగాలు
యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్ విచ్చలవిడిగా వినియోగం
ప్రైవేట్ ఆసుపత్రులతో కమీషన్ దందా
పేషెంట్పై 40 నుంచి 50 శాతం కమీషన్లు
పర్యవేక్షణలో ఆరోగ్యశాఖ వైఫల్యం
కఠిన చర్యలు కోరుతున్న గ్రామస్థులు
కాకతీయ, చేర్యాల : పల్లెల్లో ప్రజల నమ్మకాన్ని ఆయుధంగా చేసుకుని కొందరు ఆర్ఎంపీలు హద్దులు దాటుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రథమ చికిత్సకే పరిమితం కావాల్సిన ఆర్ఎంపీలు ప్రొఫెషనల్ డాక్టర్ల మాదిరిగా వైద్యం చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూర్ గ్రామంలో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో చిన్నపాటి జ్వరం వచ్చినా, అనారోగ్యం వచ్చినా ముందుగా గుర్తొచ్చేది ఆర్ఎంపీ డాక్టర్లే. కానీ ఈ గుడ్డి నమ్మకమే ఇప్పుడు ప్రమాదంగా మారుతోంది. అవసరం లేకున్నా ఇంజక్షన్లు, సెలైన్లు, బలమైన యాంటీబయోటిక్స్ ఇస్తూ డబ్బులు దండుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. కొందరు ఆర్ఎంపీలు చిన్న క్లినిక్లను నర్సింగ్ హోమ్ల మాదిరిగా మార్చి బెడ్లు వేసి చికిత్స అందించడం ఆందోళన కలిగిస్తోంది.

ప్రైవేట్ ఆసుపత్రులతో కమిషన్ దందాలు
కొంతమంది ఆర్ఎంపీలు ప్రైవేట్ ఆసుపత్రులకు ఏజెంట్లుగా మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోగం చిన్నదే అయినా పెద్దదిగా చూపించి తమకు అనుబంధం ఉన్న ఆసుపత్రులకు పంపిస్తున్నారు. అక్కడ అనవసర పరీక్షలు, చికిత్సల పేరుతో వేల రూపాయలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో పేషెంట్ను రిఫర్ చేస్తే 40 నుంచి 50 శాతం వరకు కమిషన్ తీసుకుంటున్నారన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. అమాయకుల ప్రాణాలను అడ్డం పెట్టుకుని ఈ దందా సాగుతోందని ప్రజలు మండిపడుతున్నారు. అర్హత కలిగిన వైద్యులు మాత్రమే ఇవ్వాల్సిన యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్ను ఆర్ఎంపీలు విచ్చలవిడిగా వాడుతున్నారన్నది బహిరంగ రహస్యమే. రోగి ఆరోగ్య స్థితిపై పూర్తి అవగాహన లేకుండానే బలమైన మందులు ఇవ్వడం భవిష్యత్తులో తీవ్ర దుష్పరిణామాలకు దారి తీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రిస్క్రిప్షన్ రాయడం, ఇంజక్షన్లు ఇవ్వడం వంటి చర్యలు కూడా నిబంధనలకు విరుద్ధమే అయినప్పటికీ ఆర్ఎంపీలు అవే పనులు చేస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య వ్యవస్థపై నమ్మకం దెబ్బతింటోంది.

పర్యవేక్షణలో వైఫల్యం
ఆరోగ్యశాఖ అధికారులు అప్పుడప్పుడూ తనిఖీలు చేపట్టినా అవి తాత్కాలికంగానే పరిమితమవుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని క్లినిక్లు సీజ్ చేసినా కొద్ది రోజులకే మళ్లీ తెరుచుకోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆకునూర్, రాంపూర్, కాశేగూడెం ప్రాంతాల్లో ఈ పరిస్థితి మరింత తీవ్రమైందని స్థానికులు చెబుతున్నారు. ప్రైవేట్ ల్యాబ్లు, డయాగ్నస్టిక్ సెంటర్లతో కుమ్మక్కై ప్రజలను మోసం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నకిలీ వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ ఇప్పటికే హెచ్చరించింది. అనుమతి లేకుండా వైద్యం చేస్తే భారీ జరిమానాలు, జైలు శిక్షలు తప్పవని స్పష్టం చేసింది. అయినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఆదేశాలు అమల్లోకి రావడం లేదు. ఆర్ఎంపీ వ్యవస్థ నియంత్రణలో వైఫల్యం గ్రామీణ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. ఇప్పటికైనా ఆరోగ్యశాఖ కఠిన చర్యలు తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


