ములుగు కోర్టుకు బాంబు బెదిరింపు
కాకతీయ, ములుగు ప్రతినిధి:ములుగు జిల్లా కోర్టులో బాంబు ఉన్నట్లు వచ్చిన సమాచారంతో ఒక్కసారిగా జిల్లా కేంద్రంలో తీవ్ర కలకలం రేపింది. న్యాయ వ్యవస్థకు కేంద్రమైన కోర్టు ప్రాంగణంలో ఈ వార్త బయటకు రావడంతో ప్రజలు, న్యాయవాదులు భయాందోళనలకు గురయ్యారు.వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమై, కోర్టు ప్రాంగణాన్ని ఖాళీ చేయించారు. ఎవరూ లోపలికి వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. కొద్ది నిమిషాల్లోనే కోర్టు పరిసరాలు పోలీసు బందోబస్తుతో నిండిపోయాయి.డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగి కోర్టు ప్రాంగణాన్ని అణువణువునా తనిఖీ చేపట్టారు. రికార్డ్ గదులు, కోర్టు హాళ్లు, పార్కింగ్ ప్రాంతాలు ఏ మూలను వదలకుండా సోదాలు నిర్వహించారు. గంటల పాటు సాగిన తనిఖీల అనంతరం ఎలాంటి పేలుడు పదార్థాలు గుర్తించలేదని ప్రాథమికంగా అధికారులు తెలిపారు.ఈ ఘటన తప్పుడు సమాచారమై ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఈ బాంబు కలకలం కారణంగా కోర్టు కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. విచారణకు వచ్చిన కేసులు వాయిదా పడ్డాయి. న్యాయవాదులు, ప్రజలు భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.ఇక, తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజల్లో భయాందోళనలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.పోలీసుల సోదాల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకపోవడంతో జిల్లా వాసులు ఊపిరి పీల్చుకున్నారు.


