విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
కాకతీయ, మధిర : విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హెచ్చరించారు. వైద్యులు, సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఆదివారం మధిర ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాజువాలిటీ, ఎల్.డి.ఆర్.ఎం రూమ్, డయాలసిస్ సెంటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ వార్డ్, రేడియాలజీ బ్లాక్, ఓపి విభాగాలను పరిశీలించారు. రోగులతో నేరుగా మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు.
ఆసుపత్రి సేవలపై సమీక్ష
వైద్య సేవల నాణ్యత, సిబ్బంది పనితీరు, రోజువారీ కేసులు, ముఖ్య రిజిస్టర్లు, ఔషధాల లభ్యత, పరిశుభ్రత అంశాలపై కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. సేవలు మరింత మెరుగుపడేలా వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. డ్యూటీకి హాజరు కాని వైద్యులు, సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. హాజరు వివరాలను రెగ్యులర్గా తనకు నివేదించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెంచాలంటే సకాలంలో సేవలు అందించాలని అన్నారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని, అనవసర సిజేరియన్ ఆపరేషన్లు తగ్గించాలని సూచించారు. ఎమర్జెన్సీ వార్డ్లో కేస్ షీట్లను పరిశీలించి చికిత్సపై ఆరా తీశారు. రోగులకు అందుతున్న భోజనం నాణ్యతను కూడా నేరుగా తెలుసుకున్నారు. ఈ పర్యటనలో మధిర తహసీల్దారు రాంబాబు, సంబంధిత అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


