వైభవంగా ఉగాది ఉత్సవాలు
కళాకారుల ప్రతిభకు వేదిక
టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు
కాకతీయ, కొత్తగూడెం : పాల్వంచ పట్టణంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి కవులు, కళాకారులు పాల్గొని ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారని టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని వేణుగోపాల్ థియేటర్ ప్రాంగణంలో పాల్వంచ కళా పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ తెలుగు సంవత్సర ఉగాది వేడుకల చివరి రోజు కార్యక్రమాలు జరిగాయి. ముఖ్య అతిథులుగా నాగా సీతారాములు, సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, కాంగ్రెస్ నాయకులు కోనేరు చిన్ని (సత్యనారాయణ), ముత్యాల విశ్వనాథం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగా సీతారాములు మాట్లాడారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా రాష్ట్రం నలుమూలల నుంచి కవులు, కళాకారులను సమీకరించిన నిర్వాహకుల కృషిని అభినందించారు. కార్యక్రమం విజయవంతం కావడంలో వారి పాత్ర గొప్పదని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లను సన్మానించారు. కళాకారులకు బహుమతులు అందజేశారు. నిర్వాహకులు నాగా సీతారాములను పట్టు శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందించారు. ఈ కార్యక్రమంలో కళా పరిషత్ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ బిక్కసాని సుధాకర్, అధ్యక్షుడు మంతపురి రాజు గౌడ్, ప్రధాన కార్యదర్శి వేముల కొండలరావు, డాక్టర్ బుచ్చయ్య, లింగమూర్తి, నాయుడు, రమేష్, ఎల్లారెడ్డి, వ్యాఖ్యాత నరసింహ కుమార్, కార్పొరేటర్లు, పుర ప్రముఖులు పాల్గొన్నారు.


