ప్రజా సమస్యలపై ఉద్యమించాలి
సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి
కాకతీయ, కరీంనగర్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చట్టాలతో దేశ సంపదను కార్పొరేట్లకు అప్పగిస్తోందని ఐక్య ఉద్యమాలతో వాటిని ఎదుర్కోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు. ఆదివారం మానకొండూరు మండల కమిటీ సమావేశం జిల్లా కేంద్రంలోని ముకుందలాల్ మిశ్రా భవనంలో నిర్వహించగా ఆయన మాట్లాడారు. రైతు, విత్తన, విద్యుత్ చట్టాలు బహుళజాతి సంస్థలకు అనుకూలంగా ఉన్నాయని, రైతాంగాన్ని భూమి నుంచి వేరు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తీసుకురావడం కార్మిక వర్గానికి నష్టమన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు కోతపెట్టి నిర్వీర్యం చేస్తున్నారని, కేంద్రం వాటాను తగ్గించి రాష్ట్రాలపై భారం మోపిందన్నారు. పెరిగిన ధరలతో పేద, మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందని, వ్యవసాయ కూలీలకు పని దినాలు పెంచి కనీస వేతనం రూ.600 చేయాలని, పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కుల, మత విభేదాలను రెచ్చగొట్టి రాజకీయ లాభం పొందుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు చట్టబద్ధత కల్పించాలని, ఆరు గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24న జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో మండల నాయకులు పాల్గొన్నారు.


