యువత ఐక్యంగా పోరాటం చేయాలి
కాకతీయ, కరీంనగర్ : భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆదివారం 2 కి.మీ. పరుగుపందెం నిర్వహించారు. గీత భవన్ చౌరస్తా నుంచి భగత్ నగర్లోని భగత్ సింగ్ విగ్రహం వరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా నాయకుడు మిల్కూరి వాసుదేవరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ సామ్రాజ్యవాదం, దోపిడీ వ్యవస్థలు, మతోన్మాద శక్తులు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో యువత ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు మానవాళికి వినాశనమే తెస్తాయని శాంతి, సమానత్వం, సామాజిక న్యాయం కోసం పోరాడటమే భగత్ సింగ్కు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరేష్ పటేల్ మాట్లాడుతూ దేశంలో నిరుద్యోగం పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. డ్రగ్స్, గంజాయి, బెట్టింగ్ యాప్స్ వంటి చెడు అలవాట్లు యువతను దారి తప్పిస్తున్నాయని హెచ్చరించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యారంగంలో వాణిజ్యవాదం పెరిగి పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విద్యార్థులు సామాజిక బాధ్యతతో అన్యాయాలపై ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


