కాంగ్రెస్కు జీవన్ రెడ్డి గుడ్బై..!
25న రాజీనామా చేస్తానని ప్రకటన
గౌరవం లేకుండా కొనసాగలేనని స్పష్టీకరణ
నాలుగు దశాబ్దాల అనుబంధానికి ముగింపు పలికిన నేత
జరిగిత్యాల ఇందిరా భవన్ ప్రెస్ మీట్లో కీలక ప్రకటన
సొంత పార్టీపైనే పోరాటం పరిస్థితి అంటూ ఆవేదన
నా సమస్యకు ఎవరూ పరిష్కారం చూపలేరు
జగిత్యాలతో నా అనుబంధం ఎవ్వరూ తెంచలేరు
చివరి శ్వాస వరకు ఆ బంధం కొనసాగుతుంది
మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కాంగ్రెస్ పార్టీలో ఇక కొనసాగలేనని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. “నా సమస్యకు ఎవరి వద్దా పరిష్కారం లేదు… గౌరవం లేకపోతే పార్టీలో ఉండటానికి అర్థం ఏమిటి” అంటూ తన అసంతృప్తిని బహిర్గతం చేశారు. నాలుగు దశాబ్దాలుగా కొనసాగిన అనుబంధాన్ని తెంచుకోవడం బాధాకరమేనని పేర్కొంటూనే, పరిస్థితులు తనను ఈ నిర్ణయానికి దారితీశాయని వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో తన స్వేచ్ఛకు అనుగుణంగా ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అదే రోజు జగిత్యాలలోని బండారి గార్డెన్లో అభిమానులు, శ్రేయోభిలాషులు, రాజకీయ సహచరులతో సమావేశమై తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్లు తెలిపారు. “జగిత్యాలతో నా అనుబంధం ఎవ్వరూ తెంచలేరు… చివరి శ్వాస వరకు కొనసాగుతుంది” అని ఆయన స్పష్టం చేశారు.

సొంత పార్టీపైనే పోరాటం
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ గత 20 నెలల పరిణామాలు తనను ఈ దశకు తీసుకువచ్చాయని అన్నారు. శాసన మండలిలో ఒంటరిగా ప్రజల పక్షాన పోరాటం చేశానని, అధికారంలో ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపై రాజీ పడలేదని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రకటించిన రైతు ప్రోత్సాహకాన్ని అమలు చేయాలని మంత్రిగా ఉన్నప్పటికీ ధర్నాలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. విద్యుత్ అదనపు బిల్లుల ఉపసంహరణ కోసం ఎమ్మెల్సీగా ఉద్యమించానన్నారు. అయితే ప్రస్తుతం పార్టీ వ్యవహారాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల జోక్యం పెరిగిందని, కార్యకర్తల హక్కులు కాలరాస్తున్నారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో తాను సూచించిన అభ్యర్థులకు టిక్కెట్లు వచ్చినప్పటికీ ప్రచారం చేయలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. “ప్రత్యర్థిపై పోరాటం సహజం… కానీ సొంత పార్టీపైనే పోరాటం చేయాల్సిన పరిస్థితి బాధాకరం” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. “నాలో అసహనం పెరుగుతోంది” అని వ్యాఖ్యానించారు.
పరిష్కారం లేని సమస్యలు
తన సమస్యను మంత్రి శ్రీధర్ బాబుతో చర్చించినప్పటికీ ఎలాంటి పరిష్కారం రాలేదని జీవన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర నాయకత్వం విషయాన్ని అధిష్టానంపై నెట్టివేస్తోందని, స్థానిక ఎమ్మెల్యే జోక్యం వల్ల తనకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. ప్రతిపక్షంగా పదేళ్లు కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన తర్వాత కార్యకర్తలను పక్కనబెట్టడం తాను సహించలేనని స్పష్టం చేశారు. “రాజకీయాల్లో గౌరవమే ముఖ్యం… అది లేకపోతే కొనసాగటం వల్ల ప్రయోజనం లేదు” అని తేల్చిచెప్పారు. ప్రాణహిత నది తెలంగాణకు ప్రాణాధారం అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. తుమ్మడి హేట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేపట్టాలని గతంలో నిర్ణయించినప్పటికీ, ప్రస్తుతం జాప్యం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ నుంచి రంగారెడ్డి వరకు త్రాగు, సాగు, పారిశ్రామిక అవసరాలకు ఈ ప్రాజెక్టు కీలకమని వివరించారు. ఈ పనులు ఆలస్యమైతే ఉత్తర తెలంగాణ కరువు ముప్పును ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మేడిగడ్డ పునరుద్ధరణ కూడా ఇప్పటివరకు చేపట్టలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ పనులు చేయకపోతే ప్రభుత్వం స్వయంగా చేపట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు.
25న తదుపరి అడుగు
ఈ నెల 25న రాజీనామాతో పాటు భవిష్యత్ రాజకీయ కార్యాచరణను ప్రకటించనున్నట్లు జీవన్ రెడ్డి తెలిపారు. పార్టీ మేనిఫెస్టోలోని ప్రజాహిత అంశాలను అమలు చేయకపోవడం సరికాదని విమర్శించారు.
రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల ప్రభావం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రతిష్ఠపై పడుతోందని పేర్కొన్నారు. తన స్థాయిలో పోరాటం కొనసాగించానని, అయితే సంయమనానికి కూడా పరిమితి ఉంటుందని వ్యాఖ్యానించారు.


