గ్రానైట్ మాఫియా దౌర్జన్యం…
-ప్రజల ప్రాణాలకు ముప్పు
-ప్రాణాలపై పరిగెత్తుతున్న భారీ లారీలు
-స్థానికుల్లో తీవ్ర ఆందోళన
కాకతీయ,శంకరపట్నం:మండలంలో గ్రానైట్ తవ్వకాలు నియంత్రణ లేకుండా కొనసాగుతున్నాయి. అనుమతుల పరిమితులను అతిక్రమిస్తూ సాగుతున్న తవ్వకాలతో పాటు, రాళ్ల రవాణా కోసం తిరిగే భారీ లారీలు ప్రజల్లో తీవ్ర భయాందోళనలకు కారణమవుతున్నాయి. ఆదివారం జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులు, అతివేగంగా దూసుకెళ్తున్న గ్రానైట్ లారీలను చూసి ప్రాణభయంతో వణికిపోయారు. లారీల్లో లోడైన రాళ్లు ఎప్పుడు జారిపడతాయోననే ఆందోళనతో ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఎలాంటి భద్రతా చర్యలు పాటించకుండా, నియంత్రణ లేకుండా దూసుకెళ్తున్న ఈ వాహనాలు రహదారులపై ప్రయాణించే సాధారణ ప్రజలకు ముప్పుగా మారుతున్నాయి. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు, ద్విచక్ర వాహనదారులు ప్రాణాలు పణంగా పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోంది. గ్రానైట్ రవాణా పేరుతో నిబంధనలు బేఖాతరు చేస్తూ జరుగుతున్న ఈ అక్రమ కార్యకలాపాలపై అధికార యంత్రాంగం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని, వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, లారీల వేగ నియంత్రణతో పాటు భద్రతా ప్రమాణాలు కచ్చితంగా అమలు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


