హైరైజ్ బిల్డింగ్లకు ఓకే
హైదరాబాద్ నిర్మాణ రంగంలో ఇక విప్లవమే..!
చిన్న స్థలమున్నా ఇకపై అనుమతులు
బిల్డింగ్ రూల్స్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు
సెట్బ్యాక్, డెన్సిటీలో భారీ సడలింపులు
నేటి నుంచి కొత్త నిర్మాణ నిబంధనలు అమల్లోకి
డెవలపర్లకు వెసులుబాటు.. రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం
కాకతీయ, తెలంగాణ బ్యూరో : పట్టణ అభివృద్ధికి ఊతమిస్తూ తెలంగాణ ప్రభుత్వం బిల్డింగ్ రూల్స్లో కీలక మార్పులు చేసింది. 2012 నాటి తెలంగాణ బిల్డింగ్ నిబంధనల్లో సవరణలు చేస్తూ టీడీఆర్ వినియోగాన్ని విస్తరించింది. ఎత్తైన భవనాల నిర్మాణానికి ఉన్న పరిమితులను సడలిస్తూ డెవలపర్లకు మరింత స్వేచ్ఛ కల్పించింది. ఈ మార్పులు మార్చి 22, 2026న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ విభాగం ద్వారా అమల్లోకి వచ్చాయి. పట్టణాల్లో స్థలాభావం పెరుగుతున్న నేపథ్యంలో నిలువు విస్తరణకు ప్రోత్సాహం ఇవ్వడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. టీడీఆర్ విధానాన్ని మరింత విస్తరించడం ద్వారా నగరాల్లో అభివృద్ధి వేగవంతం అవుతుందని అంచనా వేస్తున్నారు.
హై రైజ్కు కొత్త నిర్వచనం..
కొత్త నిబంధనల ప్రకారం హై రైజ్ భవనాల నిర్వచనంలో మార్పులు చేశారు. ఇంతకు ముందు ఉన్న పరిమితులను సవరించి ఇప్పుడు 21 మీటర్లకు పైగా ఉన్న భవనాలను హై రైజ్గా పరిగణిస్తున్నారు. అయితే 18 నుంచి 21 మీటర్ల మధ్య ఉన్న భవనాలకు కూడా టీడీఆర్ వినియోగంతో అనుమతులు ఇవ్వనున్నారు. చిన్న స్థలాలపై కూడా ఎత్తైన భవనాల నిర్మాణానికి వీలు కల్పించడం ద్వారా నగరాల్లో స్థల వినియోగం మెరుగుపడే అవకాశం ఉంది. కొన్ని కేటగిరీల భవనాలకు టీడీఆర్ వినియోగాన్ని తప్పనిసరి చేశారు. 11 నుంచి 20 అంతస్తుల భవనాల్లో 10వ అంతస్తు పైభాగానికి 3 శాతం టీడీఆర్ అవసరం ఉంటుంది. 20 అంతస్తులకు పైగా ఉన్న భవనాలకు 20వ అంతస్తు పైభాగానికి 5 శాతం టీడీఆర్ వర్తిస్తుంది. ముందుగా ప్రతిపాదించిన అధిక శాతంతో పోలిస్తే ఈ నిబంధన కొంత సడలింపుగా భావిస్తున్నారు. అయితే డెవలపర్లపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశముంది.
సెట్బ్యాక్, డెన్సిటీలో సడలింపులు
హై రైజ్ భవనాలకు సెట్బ్యాక్లలో 10 శాతం వరకు సడలింపు ఇవ్వనున్నారు. అయితే కనీసంగా 7 మీటర్ల భద్రతా దూరం తప్పనిసరిగా ఉండాలి. పెద్ద స్థలాలపై అదనంగా 3 నుంచి 5 అంతస్తులు నిర్మించుకునే అవకాశం కూడా కల్పించారు. రోడ్డు వెడల్పును బట్టి ఈ అదనపు అంతస్తుల అనుమతులు ఇవ్వడం ద్వారా నగర ప్రణాళికలో సమతుల్యత సాధించాలనే ఉద్దేశ్యం కనిపిస్తోంది. ఈ సవరణలు రియల్ ఎస్టేట్ రంగంపై మిశ్రమ ప్రభావం చూపనున్నాయి. ఒకవైపు డెవలపర్లకు మరింత డిజైన్ స్వేచ్ఛ లభించనుంది. మరోవైపు టిడిఆర్ తప్పనిసరి నిబంధనల కారణంగా నిర్మాణ వ్యయాలు పెరిగే అవకాశం ఉంది. ప్రత్యేకంగా హై రైజ్ ప్రాజెక్టుల్లో చదరపు అడుగుకు రూ.300 నుంచి రూ.400 వరకు అదనపు ఖర్చు వచ్చే అవకాశముందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తం మీద పట్టణాభివృద్ధికి దోహదపడే ఈ మార్పులు, రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త దిశను సూచిస్తున్నాయి.


