ఎస్ఎస్బీలో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు
గ్రూప్ సి పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదల
టెన్త్, ఇంటర్, డిప్లొమా అర్హతతో దరఖాస్తులకు అవకాశం
కాకతీయ,తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వానికి చెందిన సశస్త్ర సీమా బల్ లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చింది. గ్రూప్ సి నాన్ గెజిటెడ్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 233 పోస్టులను భర్తీ చేయనున్న ఈ ప్రక్రియలో కమ్యూనికేషన్, ఎలక్ట్రీషియన్, వెటర్నరీ, స్టీవార్డ్ విభాగాల్లో అవకాశాలు కల్పించారు. టెన్త్, ఇంటర్, డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ మార్చి 21న విడుదలైంది. నోటిఫికేషన్ విడదలైన తేదీ నుంచి 30 రోజుల్లోపు అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
అత్యధికంగా కమ్యూనికేషన్ విభాగానికి 197 పోస్టులు కేటాయించారు. ఎలక్ట్రీషియన్ విభాగంలో 29 పోస్టులు, వెటర్నరీ విభాగంలో 5 పోస్టులు, స్టీవార్డ్ విభాగంలో 2 పోస్టులు ఉన్నాయి.
అర్హతలు ఇవే..
అభ్యర్థులు పోస్టును అనుసరించి టెన్త్ లేదా సైన్స్ గ్రూప్లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎలక్ట్రీషియన్, వెటర్నరీ, స్టీవార్డ్ పోస్టులకు సంబంధిత విభాగంలో ఐటీఐ లేదా డిప్లొమా అర్హత తప్పనిసరి. అలాగే సంబంధిత రంగంలో అనుభవం కూడా అవసరం. వయోపరిమితి సాధారణంగా 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఎలక్ట్రీషియన్ పోస్టులకు 18 నుంచి 25 సంవత్సరాల వరకు పరిమితి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం.. జీతం..!
అభ్యర్థుల ఎంపికలో మొదట ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఆ తర్వాత రాత పరీక్ష, నైపుణ్య పరీక్షల ద్వారా తుది ఎంపిక జరుగుతుంది. ఎంపికైన వారికి నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 వరకు జీతం చెల్లిస్తారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఇతర అలవెన్సులు కూడా అందిస్తారు. కేంద్ర ప్రభుత్వంలో స్థిరమైన ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు.


