కాంగ్రెస్ బడ్జెట్ అంకెల గారడీ..
ఆరు గ్యారంటీలు కాదు ఆరు మోసాలు
ఇదీ ప్రజలకు లాభం లేని బడ్జెట్
బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు
కాకతీయ,ఖమ్మం బ్యూరో : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీగా మారిందని, ప్రజలకు ఇచ్చిన హామీలు మోసాలుగా మిగిలిపోయాయని బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు విమర్శించారు. శనివారం ఖమ్మం జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్ కేవలం కాగితాలకే పరిమితమైందని పేర్కొన్నారు. దేవకి వాసుదేవరావు మాట్లాడుతూ, ఆరు గ్యారంటీలు ఆరు మోసాలుగా మారాయని అన్నారు. ప్రజలకు ఇచ్చిన 420 హామీలు 420 అబద్ధాలుగా మిగిలిపోయాయని విమర్శించారు. బడ్జెట్ కేటాయింపులు, క్షేత్రస్థాయి ఖర్చులకు ఎక్కడా పొంతన లేదన్నారు. నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది అందరూ మోసపోయారని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారిందని చెప్పారు. 2025-26లో రాష్ట్ర అప్పులు 8,05,840 కోట్లుగా ఉన్నాయని, అవి 9 లక్షల కోట్లకు చేరుకునే ప్రమాదం ఉందన్నారు. మూలధన వ్యయం 20 శాతానికే పరిమితమైందని విమర్శించారు. ఆరు గ్యారంటీలకు 50 వేల కోట్లు కేటాయించినట్లు చెప్పినా, 58,713 కోట్ల రెవెన్యూ లోటు చూపించడం వాస్తవ పరిస్థితిని బయటపెడుతోందన్నారు. విద్యకు తక్కువ నిధులు కేటాయించారని అన్నారు. 15 శాతం ఇవ్వాలని డిమాండ్ చేస్తే, 8 శాతానికే పరిమితం చేశారని విమర్శించారు. ఎస్సీ సంక్షేమానికి 40,234 కోట్ల నుంచి 11,784 కోట్లకు కోత విధించారని తెలిపారు. ఎస్టీ సంక్షేమానికి 17,169 కోట్ల నుంచి 7,937 కోట్లకు తగ్గించారని పేర్కొన్నారు.
కేంద్ర నిధులతో గొప్పలు
కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం వాటిని కాపీ కొడుతోందని నెల్లూరి కోటేశ్వరరావు ఆరోపించారు. గోదావరి పుష్కరాలకు కేవలం 500 కోట్లు మాత్రమే కేటాయించారని విమర్శించారు. జర్నలిస్టుల సంక్షేమాన్ని కూడా విస్మరించారని అన్నారు. ఖమ్మం జిల్లాకు ఈ బడ్జెట్లో అన్యాయం జరిగిందని చెప్పారు. సీతారామ ప్రాజెక్టు, మున్నేరు మరమ్మతులు, తీగల వంతెనకు నిధులు కేటాయించలేదని విమర్శించారు. రైతుల రుణమాఫీపై ప్రభుత్వం స్పందించలేదన్నారు. వెలుగుమట్లలో భూ బాధితులకు అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన విఫలమైందని విమర్శించారు. సమస్యలు పరిష్కరించలేకపోతే పదవి వదలాలని డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చే వరకు బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు శాసన సాయిరాం, మణికంఠ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


