అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలి
కేసీఆర్ హయాంలో మైనార్టీలకు పెద్దపీట
బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి
కాకతీయ, గజ్వేల్ : ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా గజ్వేల్ పట్టణంలోని ఈద్గా, ప్రజ్ఞాపూర్ ఈద్గా వద్ద ముస్లిం సోదరులను కలిసి బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని కోరుకుంటూ, రంజాన్ పండుగ క్రమశిక్షణ, సేవాభావానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి శాంతి, సిరిసంపదలు, సంతోషాలు నిండాలని ఆకాంక్షించారు. ఈద్గాల్లో ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
కేసీఆర్ ప్రభుత్వంలో మైనార్టీలకు న్యాయం
గత కేసీఆర్ ప్రభుత్వంలో మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు గుర్తు చేశారు. షాదీ ముబారక్ ద్వారా పేద కుటుంబాలకు అండగా నిలిచామని, ఇమామ్లు, ముజ్జిన్లకు గౌరవ వేతనాలు అందించినట్లు తెలిపారు. రంజాన్ తోఫాలు, ఇఫ్తార్ విందుల ద్వారా మైనార్టీలకు ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో దాదాపు 10 వేల కోట్ల రూపాయలతో మైనార్టీల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని, స్వయం ఉపాధి కోసం వేలాది మందికి శిక్షణ, వాహనాలు అందించామని పేర్కొన్నారు. 3310 మందికి విదేశీ విద్య కోసం స్కాలర్షిప్లు అందించామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మైనార్టీ గురుకులాలు, జూనియర్ కళాశాలల ద్వారా లక్షలాది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించామని, గజ్వేల్ ప్రాంతంలో దాదాపు రూ.20 కోట్లతో మైనార్టీ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. మదీనా మస్జిద్ వద్ద షాపింగ్ కాంప్లెక్స్, షాదీ ఖానా నిర్మాణం, ఈద్గాలకు స్థలాల కేటాయింపు, మహిళలకు 420 కుట్టుమిషన్ల పంపిణీ వంటి కార్యక్రమాలు అమలు చేశారని తెలిపారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. రంజాన్ తోఫాల పంపిణీలో పారదర్శకత లేకుండా వ్యవహరిస్తోందని, పేద ముస్లింలను విస్మరిస్తోందని మండిపడ్డారు. మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తోందని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా వైఖరి మార్చుకుని మైనార్టీలకు సమాన న్యాయం చేయాలని, వారి సంక్షేమానికి కట్టుబడి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గంగిశెట్టి చందన రవీందర్, వైస్ చైర్మన్ పద్మాబాయి నర్సింగరావు, రాష్ట్ర నాయకులు విరాసత్ అలీ, పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీర్, మాజీ వైస్ చైర్మన్ జక్కియోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.


