పంట నష్టంపై సర్వే చేయాలి
నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి
సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా
కాకతీయ, కొత్తగూడెం : వడగండ్ల వానతో నష్టపోయిన మొక్కజొన్న రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా డిమాండ్ చేశారు. లక్ష్మీదేవిపల్లి మండలంలో అకాల వర్షం, వడగండ్ల వాన, ఈదురుగాలులతో మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. శనివారం జరిగిన పరిస్థితులపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ కె సాబీర్ పాషా మాట్లాడుతూ, భారీ స్థాయిలో పంట నష్టం జరిగిందన్నారు. అప్పులు చేసి సాగు చేసిన రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలిపారు. తీవ్ర నష్టంతో గుండె నిబ్బరం కోల్పోతున్న రైతాంగానికి ప్రభుత్వం భరోసా కల్పించాలని కోరారు. పంట నష్టంపై వ్యవసాయ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టాలని డిమాండ్ చేశారు. నివేదికలను ప్రభుత్వానికి పంపించి పరిహారానికి సిఫారసు చేయాలని అన్నారు. నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
క్షేత్ర స్థాయిలో పర్యటన
జిల్లా సిపిఐ ఆదేశాల మేరకు పార్టీ మండల కార్యదర్శి దీటి లక్ష్మీపతి, నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పరుపర్తి రాజు, దారా శ్రీనివాస్, కంటెం సత్యనారాయణ, శేఖర్, లక్ష్మణ్, మౌనిక, రాంబాబు, ఉమామహేశ్వరి తదితరులు మొక్కజొన్న చేలను సందర్శించారు. రైతులను కలిసి నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు.


