ఆంజనేయ స్వామి ఆలయానికి విరాళం
కాకతీయ,చెన్నారావుపేట : నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలం గొల్లపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయానికి బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి విరాళం అందజేశారు. గ్రామ యువకులు స్వచ్ఛందంగా ఆలయ నిర్మాణానికి కృషి చేస్తున్న విషయం తెలిసిన ఆయన, తనవంతుగా రూ.10,116 అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో సామూహికంగా చేపట్టే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఐక్యతను పెంపొందించడంతో పాటు అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. ఆలయ నిర్మాణం విజయవంతంగా పూర్తి కావాలని ఆకాంక్షించారు. విరాళం అందజేసినందుకు గ్రామ యువకులు, పెద్దలు రాణా ప్రతాప్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ నిర్మాణ పనులు కొనసాగుతున్నట్లు స్థానికులు తెలిపారు.


