హుజురాబాద్ గులాబీలో గూటి పోరు!
ఎమ్మెల్యే కౌశిక్రెడ్డికి వ్యతిరేకంగా నేతల సమావేశం
జమ్మికుంట సమీపంలోని ధర్మారంలో పెద్ద సంఖ్యలో నేతల భేటీ
ఎమ్మెల్యే సీనియర్లను పక్కనబెట్టారంటూ మండిపాటు
‘ఒంటెద్దు’ శైలి నిర్ణయాలతో పార్టీకి నష్టం చేస్తున్నట్లు విమర్శలు
ఆయన వెంట ఉంటే కేసులు తప్పవంటూ ఆందోళన
కేసీఆర్ను కలిసి పరిస్థితిని వివరించాలని సీనియర్ నేతల ఆలోచన
కాకతీయ, కరీంనగర్ బ్యూరో: హుజూరాబాద్ బీఆర్ఎస్లో అంతర్గత విభేదాలు ఉధృతరూపం దాల్చాయి. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నాయకత్వంపై సీనియర్ నేతలు బహిరంగ అసంతృప్తి వ్యక్తం చేస్తూ తిరుగుబాటు స్వరాన్ని వినిపించారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ధర్మారంలో శుక్రవారం రాత్రి గోప్యంగా నిర్వహించిన సమావేశం పార్టీలో నెలకొన్న విభేదాలను వెలుగులోకి తీసుకొచ్చింది. సుమారు వందమంది కీలక నేతలు హాజరుకావడం ఈ అసంతృప్తి తీవ్రతను స్పష్టంచేసింది. సమావేశంలో పలువురు సీనియర్ నేతలు ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పార్టీ బలోపేతం కన్నా వ్యక్తిగత ఆధిపత్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడిన సీనియర్లను పక్కనబెట్టి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కేడర్లో అసంతృప్తి పెరిగిందని పేర్కొన్నారు. స్థానిక నాయకత్వాన్ని పట్టించుకోకపోవడం, క్షేత్రస్థాయిలో అనుసంధానం కోల్పోవడం పార్టీ బలహీనతకు దారితీస్తోందని అభిప్రాయపడ్డారు.

కేసుల భయం.. కేడర్లో కలకలం
వ్యక్తిగత వివాదాలను పార్టీపైకి మోపడం వల్ల కార్యకర్తలు పోలీసు కేసుల్లో ఇరుక్కుంటున్నారని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. “ఆయన వెంట ఉంటే కేసులే తప్ప ప్రయోజనం లేదు” అన్న వ్యాఖ్య సమావేశంలో చర్చనీయాంశమైంది. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను రక్షించాల్సిన సమయంలో వారినే వివాదాల్లోకి నెట్టడం సరైంది కాదని అన్నారు. హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల పరాజయాలకు కూడా ఎమ్మెల్యే నిర్ణయాలే కారణమని కొందరు నేతలు విమర్శించారు. వ్యక్తిగత అజెండాతో తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో పాల్గొన్న నేతలు పరిస్థితిని పార్టీ అధినేత కేసీఆర్కు వివరించాలని భావిస్తున్నట్లు సమాచారం. అవసరమైతే ప్రత్యక్షంగా కలిసి తమ అభ్యంతరాలను తెలియజేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. హుజూరాబాద్లో చోటుచేసుకున్న ఈ పరిణామాలు బీఆర్ఎస్కు కీలక పరీక్షగా మారాయి. అసంతృప్తి గళం ఎంతవరకు ముందుకు వెళ్తుందన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.


