పేదల ఇళ్ల కూల్చివేత వెనుక భారీ కుట్ర
311 మందికే ఇళ్లు మంజూరు చేశారు.. మిగతావాళ్ల పరిస్థితేంటి..?
ఆరు గ్యారంటీల అమలులో పట్టించుకోని ప్రభుత్వం
బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు ధ్వజం
ఖమ్మం కలెక్టరేట్ వద్ద బీజేపీ భారీ ఆందోళన
కాకతీయ, ఖమ్మం : పేదల ఇళ్ల కూల్చివేత వెనుక భారీ కుట్ర దాగి ఉందని, రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమే ప్రభుత్వం చర్యలు తీసుకుందని బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు ఆరోపించారు. పేదలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని ఆయన హెచ్చరించారు. ఖమ్మం కలెక్టరేట్ వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోరారు. అనంతరం జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. భూదాన్ భూముల్లో పేదలు కష్టపడి నిర్మించుకున్న ఇళ్లను ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడం దారుణమని బీజేపీ నేతలు మండిపడ్డారు. ఇళ్లను కూల్చిన తర్వాత కేవలం 311 మందినే అర్హులుగా గుర్తించడం అన్యాయమని, మిగిలిన పేదల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, హామీలు కేవలం మాటలకే పరిమితమయ్యాయని ఆరోపించారు. రాష్ట్ర ఆదాయంపై చెప్పే లెక్కలకు, వాస్తవాలకు పొంతన లేదని, కాంట్రాక్టుల్లో కమీషన్లకే ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు. ఖమ్మం నుంచే కాంగ్రెస్ పతనం ప్రారంభమవుతుందని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ఈ పోరాటానికి రాష్ట్ర నాయకత్వం పూర్తి మద్దతు ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుల్లారావు యాదవ్, నాయకులు నున్నా రవికుమార్, రవిరాథోడ్, గుత్తా వెంకటేశ్వర్లు, మందడపు సుబ్బారావు, రామ్శెట్టి నాగేశ్వరరావు, కుంచెం కృష్ణారావు, వక్కలంక సుబ్రమణ్యం, మేకల నాగేందర్, మంద సరస్వతి, రజిని రెడ్డి, ఏలూరి నాగేశ్వరరావు, మణి, ఇవి రమేష్, జ్వాల నరసింహారావు, గడిల నరేష్ తదితరులు పాల్గొన్నారు.


