నల్ల చట్టాలు రద్దు చేయాలి
కరువు రైతులకు భరోసా ఇవ్వాలి
రైతు సమస్యలపై ఉద్యమాలకు సిద్ధం
రైతు సంఘం సిద్ధిపేట జిల్లా కార్యదర్శి కొంగరి వెంకట మావో
కాకతీయ, చేర్యాల : కరువుతో ఇబ్బందులు పడుతున్న రైతులకు వెంటనే రైతు భరోసా అందించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొంగరి వెంకట మావో డిమాండ్ చేశారు. చేర్యాల మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన రైతు సంఘం నూతన కమిటీ ఎన్నికల్లో బోడిగం నర్సిరెడ్డి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కార్యదర్శిగా నాగపురి కనకయ్య, ఉపాధ్యక్షులుగా సూర్ణ తిరుపతి, మోకు దేవేందర్ రెడ్డి ఎంపిక కాగా, మొత్తం 12 మంది సభ్యులతో కమిటీ ఏర్పడింది. ఈ సందర్భంగా కొంగరి వెంకట మావో మాట్లాడుతూ స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయాలని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. కరువు పరిస్థితుల్లో ఉన్న రైతులకు ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని పేర్కొన్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైన బోడిగం నర్సిరెడ్డి మాట్లాడుతూ రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేపడతామని తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధర, రైతు బంధు పథకం అమలు, పోడు భూములకు పట్టాలు, సబ్సిడీ ఎరువులు, విత్తనాలు, రుణాలు, రుణమాఫీ కోసం దశలవారీగా పోరాటాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి పండుగ యాదగిరి, దొండకాయల సంపత్, కమిటీ సభ్యులు కొంగరి చంద్రమజుందార్, సూర్ణ శ్రీశైలం, నంగి మైసయ్య, మోకు ఇంద్రం, కత్తుల నరసింహారెడ్డి, బొంగురం రమేష్ రెడ్డిలు పాల్గొన్నారు


