రేవంత్రెడ్డిపై ఆధారపడుతున్న కాంగ్రెస్
కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం లోపించింది
ఐదురాష్ట్రాల ఎన్నికలు సైతం రేవంత్ రెడ్డికే అప్పగించింది
సీఎం వార్నింగ్ ఆ పార్టీలోని సీనియర్లకే
ఆశీర్వాదం పొందాల్సింది పోయి.. “తొక్కుకుంటూ వస్తాననడం దారుణం
కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయికారీ ఒప్పందం
రైతుభరోసాలో మిగతా రూ.41 వేల కోట్లు ఎక్కడ..?
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ధ్వజం
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : రాజకీయాల్లో ప్రజల ఆశీర్వాదం ప్రస్తావించాల్సింది పోయి “తొక్కుకుంటూ సీఎం అయ్యా” వంటి వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ సీనియర్ నేతలకే పరోక్ష వార్నింగ్గా ఉన్నాయని ఆయన ఆరోపించారు. పార్టీలో అసమ్మతి స్వరాలను అణచివేయడానికే ఈ వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. ప్రజల్లో కాంగ్రెస్ నాయకత్వంపై అసహ్యం పెరుగుతోందని అన్నారు. రాహుల్ గాంధీ పూర్తిగా రేవంత్ రెడ్డిపైనే ఆధారపడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల బాధ్యతలు కూడా ఆయనకే అప్పగించారని పేర్కొన్నారు. సర్వేలు నుంచి నిధుల సమీకరణ వరకు అన్నీ ఒకే వ్యక్తి చేతుల్లో ఉండటం పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యానికి భంగం కలిగిస్తోందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని ఆరోపిస్తూ 6 గ్యారంటీలపై బీఆర్ఎస్ ప్రశ్నించకపోవడం, అవినీతి అంశాల్లో కాంగ్రెస్ చర్యలు తీసుకోకపోవడం దీనికే నిదర్శనమని పేర్కొన్నారు. కరీంనగర్లో మహాశక్తి ఆలయంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఉగాది పచ్చడి సేవిస్తూ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘పరాభవ’ నామ సంవత్సరం అహంకారాన్ని జయించి విజయానికి దారి తీస్తుందని అన్నారు. అయితే ఇదే వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలను మరింత ఘాటుగా కొనసాగించారు. అసెంబ్లీలో వందేమాతరం గేయాన్ని మజ్లిస్ ఎమ్మెల్యేలు బహిష్కరించడంపై బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. గవర్నర్, సీఎం, స్పీకర్ సమక్షంలో జాతీయ గేయాన్ని అవమానించినా చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమని అన్నారు. శాసనసభ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత స్పీకర్పై ఉందని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు మౌనం తీవ్రంగా తప్పుబట్టారు. బీజేపీ అధికారంలో ఉంటే ఇలాంటి ఘటనలకు కఠిన చర్యలు తీసుకునేవాళ్లమని హెచ్చరించారు.
రూ.41 వేల కోట్లు ఎక్కడ..?
రైతు భరోసా అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బండి సంజయ్ ఆరోపించారు. చెల్లించాల్సిన రూ.58,500 కోట్లలో కేవలం రూ.17 వేల కోట్లు మాత్రమే జమ చేసి ఇంకా రూ.41 వేల కోట్లు బాకీగా ఉంచిందన్నారు. రైతులకు సుమారు రూ.30 వేలు, వ్యవసాయ కూలీలకు రూ.36 వేలు బాకీగా ఉందని వెల్లడించారు. మూడు విడతల సొమ్మును ఎగ్గొట్టారని ఆరోపిస్తూ వెంటనే బకాయిలన్నీ రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. రైతులు, కౌలు రైతులు, కూలీలు ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. కేంద్రం ‘కిసాన్ సమ్మాన్ నిధి’ ద్వారా రైతులకు నేరుగా నిధులు జమ చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం హామీల అమలులో విఫలమైందని విమర్శించారు. మూసీ ప్రక్షాళనకు బీజేపీ అనుకూలమేనని అయితే బాధితులకు అన్ని హామీలు అమలు చేసిన తర్వాతే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ పేదల ఇండ్లను కూల్చితే బుల్డోజర్లకు అడ్డంగా నిలుస్తామని హెచ్చరించారు.
హోంశాఖ ప్రాధాన్యం తెలియదా?
కరీంనగర్ ఎంపీకి ప్రాధాన్యతలేని శాఖ ఇచ్చారని మంత్రి శ్రీధర్ బాబు చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ తిప్పికొట్టారు. హోంశాఖ అత్యంత కీలకమైందని, రాష్ట్రంలోనే సీఎం దగ్గరే ఉండేంత ప్రాధాన్యం ఉన్న శాఖనని గుర్తుచేశారు. కేంద్రంలో కూడా అదే స్థాయిలో కీలక బాధ్యతలను ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా తనకు అప్పగించారని తెలిపారు. బీసీని ప్రధాని చేయడం నుంచి 27 మంది ఓబీసీలు, 12 మంది ఎస్సీలు, 7 మంది ఎస్టీలకు మంత్రి పదవులు ఇవ్వడం, ఎస్టీ ఆదివాసీ మహిళను, మైనారిటీ వర్గానికి రాష్ట్రపతి పదవి ఇవ్వడం బీజేపీ సామాజిక న్యాయానికి నిదర్శనమని పేర్కొన్నారు.


