చెరువులో మునిగి ఆవు మృతి
కాకతీయ, చెన్నారావుపేట : ప్రమాదవశాత్తు చెరువులో జారి పడిన ఆవు మృతి చెందడంతో రైతు కుటుంబానికి తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లింది. చెన్నరావుపేట మండలంలోని ఖాదర్పేట గొల్లపల్లి గ్రామానికి చెందిన రైతు బట్టమేకల మల్లేష్ ఆవును నీరు తాగించేందుకు చెరువుకు తీసుకెళ్లగా, అది జారి నీటిలో పడిపోయింది. బయటకు తీయడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వ్యవసాయానికి ఆధారమైన ఆవు మృతి చెందడంతో కుటుంబం ఆందోళన చెందుతోంది. మృతిచెందిన ఆవు విలువ సుమారు రూ.60 వేలుగా కుటుంబ సభ్యులు తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని వారు కోరుతున్నారు.


