భారీగా రేషన్ బియ్యం పట్టివేత
28 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం.. వాహనం సీజ్
శాయంపేట ఎస్సై జక్కుల పరమేశ్వర్
కాకతీయ, శాయంపేట: నిబంధనలకు విరుద్ధంగా రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని శాయంపేట ఎస్సై జక్కుల పరమేశ్వర్ హెచ్చరించారు. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పోలీసులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. మండల పరిధిలోని మైలారం గ్రామ శివారులో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా ఉన్న వాహనాన్ని తనిఖీ చేయగా పి.డి.ఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. ఆత్మకూర్ మండలం కామరాం గ్రామానికి చెందిన తక్కళ్లపెల్లి చిరంజీవి అశోక లేలాండ్ వాహనంలో రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో సుమారు 28 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని, రవాణాకు ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై జక్కుల పరమేశ్వర్ తెలిపారు.


