రూ 5.41 కోట్లతో అభివృద్ది పనులు
గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి
కాకతీయ, గజ్వేల్ : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి పేర్కొన్నారు. బుధవారం గిర్మాపూర్ లో స్థానిక సర్పంచ్ చిట్కుల విజయలక్ష్మితో కలిసి మురికి కాల్వల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలకు సిసి రోడ్లు, మురికి కాల్వల నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి విడతలో రూ.5 కోట్ల 41 లక్షలు మంజూరీ చేసిందని స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా నిధులు, ప్రభుత్వ పథకాలను వర్తింపజేస్తుండగా, సర్పంచులు త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కోరారు. రాష్ట అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటుండగా, అర్హులైన ప్రతి పేదకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ తదితర కేటాయిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా రూ 2 లక్షల వరకు పంట రుణమాఫీ, సన్నధాన్యానికి రూ 500 బోనస్ చెల్లిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకోగా, మరో నాలుగు రోజుల్లో రైతు భరోసా నిధులు అన్నదాతల ఖాతాలలో జమ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఆరు గ్యారెంటీల్లో భాగంగా ప్రతి ఇంటికి ప్రజా సంక్షేమ పథకాలు వర్తింపజేస్తుండగా, జీర్ణించుకోలేని ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే గజ్వేల్ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి అడిగినన్ని నిధులు ఇస్తుండగా, విద్య, వైద్యం, రవాణా, పారిశ్రామిక రంగాలకు పెద్దపీట వేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ నిమ్మ రంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ మోహన్, కాంగ్రెస్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కీసరి వెంకటేష్, సర్పంచులు చిట్కుల విజయలక్ష్మి, కుమార్ యాదవ్, చెన్నయ్య, యాదగిరి, మాజీ సర్పంచ్లు విష్ణువర్ధన్ రెడ్డి, చిట్కుల భూoరెడ్డి, గోపాల్ రెడ్డి, నేతలు చిట్కుల గోవర్ధన్ రెడ్డి, గంగుమల్ల కొండల్ రెడ్డి, జయరాoలు గౌడ్, నర్సాగౌడ్ పాల్గొన్నారు.


