వెలుగుమట్ల నిర్వాసితులకు న్యాయం
ప్రభుత్వ గడువుకు ముందే పట్టాల పంపిణీ
మంత్రుల చొరవతో వెలుగుమట్ల సమస్యకు పరిష్కారం
ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్
కాకతీయ, ఖమ్మం : వెలుగుమట్ల భూదాన్ నిర్వాసితుల సమస్యకు ప్రభుత్వం ఇచ్చిన గడువుకు ముందే పరిష్కారం లభించిందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు చొరవతో వెలుగుమట్ల నిర్వాసితులకు చట్టబద్ధత కల్పించారని ఆయన పేర్కొన్నారు. అర్హులైన నిరుపేదలకు న్యాయం చేసిన నిజమైన ప్రజా ప్రభుత్వం ఇదేనని అన్నారు.
అర్హులైన కుటుంబాలకు ఇంటి స్థలాలు
వెలుగుమట్ల భూదాన్ బాధితుల సమస్యను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని నూతి సత్యనారాయణ గౌడ్ తెలిపారు. అధికారులను అప్రమత్తం చేసి ఎలాంటి రాజకీయాలకు తావులేకుండా పారదర్శకంగా సర్వే నిర్వహించారని చెప్పారు. ఆ సర్వేలో మొత్తం నాలుగు వందల పన్నెండు కుటుంబాలను నిజమైన నిరుపేదలుగా గుర్తించినట్లు తెలిపారు. అందులో మూడు వందల పదకొండు కుటుంబాలకు ఇంటి స్థలం పట్టాలతో పాటు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేయగా, ఇప్పటికే ఇంటి స్థలం ఉన్న నూట ఒకటి కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతో మొత్తం నాలుగు వందల పన్నెండు కుటుంబాలకు శాశ్వత గృహ యోగం కలగబోతుందని అన్నారు. పేదల రక్తం తాగే దళారి వ్యవస్థపై జిల్లా మంత్రులు ఉక్కుపాదం మోపారని ఆయన పేర్కొన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, ఎలాంటి లంచాలకు తావులేకుండా నేరుగా మంత్రులే బాధితుల చేతికి పట్టాలు అందించడం జిల్లా చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన గడువుకు ముందే బాధితులకు న్యాయం జరగడం హర్షణీయమని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ తెలిపారు.


