ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి
కూసుమంచి మండలంలో అమానుష ఘటన
ఫోక్సో చట్టం కింద కేసు నమోదు
నిందితుడి అరెస్టుకు ప్రత్యేక బృందాలు
కాకతీయ, కూసుమంచి : కూసుమంచి మండలంలో ఐదేళ్ల బాలికపై నలభై ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయాన్ని అదనుగా చూసుకున్న నిందితుడు బాలికను మోసం చేసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిసింది. తల్లిదండ్రులు పని నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో జరిగిన ఈ ఘటన గ్రామంలో తీవ్ర ఆందోళన కలిగించింది. నిందితుడి దాడికి గురైన బాలిక తీవ్ర రక్తస్రావంతో బాధపడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు బాలిక జరిగిన విషయం చెప్పడంతో వారు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. బాలికకు వైద్యులు చికిత్స అందిస్తున్నారని సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి కేసు నమోదు చేశారు. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కఠిన సెక్షన్లు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు పోలీసులు తెలిపారు. గ్రామంలో జరిగిన ఈ ఘటనతో ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితుడికి కఠిన శిక్ష విధించాలని బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసును వేగంగా విచారణ జరిపి బాధితురాలికి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.


