జీవితాల్లో వెలుగు నింపిన గోపన్న
ఉచిత కంటి శిబిరంతో వందల మందికి కంటి వెలుగు
శంకరా కంటి ఆస్పత్రితో సంయుక్తంగా రుద్ర ఫౌండేషన్ వైద్య సేవలు
యాభై మందికి ముత్యబిందు శస్త్రచికిత్సలు.. మందుల పంపిణీ
రోగులను స్వగ్రామాలకు తీసుకొచ్చిన ఫౌండేషన్ సభ్యులు
సేవా కార్యక్రమాలు కొనసాగుతాయి : రుద్ర ఫౌండేషన్ ఛైర్మన్ పేరం గోపీకృష్ణ
కాకతీయ, వరంగల్ బ్యూరో : పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో రుద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. హైదరాబాద్లోని శంకర కంటి ఆసుపత్రి వైద్యుల సహకారంతో హనుమకొండలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో వందలాది మంది ప్రజలు పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. హనుమకొండలోని పీవీఆర్ రెసిడెన్సీ ప్రాంతంలో మైసమ్మ గుడి లేన్లో హనుమాన్ గుడి ఎదుట, పెద్దపల్లి డబుల్ డెక్కర్ సమీపంలో ఈ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కంటి సమస్యలతో బాధపడుతున్న అనేక మంది ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఈ శిబిరంలో ప్రముఖ కంటి వైద్య నిపుణులు పాల్గొని దాదాపు మూడు వందల మంది రోగులకు కంటి పరీక్షలు నిర్వహించారు. కంటి చూపు పరీక్షలు, ముత్యబిందు నిర్ధారణ, రెటీనా పరీక్షలు నిర్వహించి రోగులకు అవసరమైన వైద్య సలహాలు అందించారు. దీంతో చాలా మంది తమ కంటి సమస్యలను ముందుగానే గుర్తించుకునే అవకాశం లభించింది.

యాభై మందికి శస్త్రచికిత్సలు
వైద్యుల పరీక్షల అనంతరం దాదాపు యాభై మంది రోగులకు ముత్యబిందు శస్త్రచికిత్స అవసరమని గుర్తించారు. వీరిని హైదరాబాద్లోని శంకర కంటి ఆసుపత్రికి తరలించి పూర్తిగా ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఈ శస్త్రచికిత్సలలో ఐఓఎల్ లెన్స్ అమరిక కూడా విజయవంతంగా చేశారు. శంకర కంటి ఆసుపత్రి వైద్యులు పూర్తిగా సేవాభావంతో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ శస్త్రచికిత్సలను నిర్వహించారు. రోగులకు ఆసుపత్రిలో భోజనం, వసతి వంటి సౌకర్యాలను కూడా ఉచితంగా కల్పించారు. దీంతో ఆర్థికంగా వెనుకబడిన పేద కుటుంబాలకు ఈ వైద్య సేవలు ఎంతో ఉపయోగకరంగా మారాయి. హైదరాబాద్లోని శంకర కంటి ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు పూర్తయ్యాక రోగులు తిరిగి స్వగ్రామాలకు చేరుకున్నారు. చాలా కాలంగా ముత్యబిందు సమస్యతో బాధపడుతూ స్పష్టంగా కనిపించక ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా కంటి ఆపరేషన్ చేయించుకోలేకపోయామని చెప్పారు. రుద్ర ఫౌండేషన్ నిర్వహించిన కంటి వైద్య శిబిరం ద్వారా తమ సమస్యను గుర్తించి హైదరాబాద్కు తీసుకెళ్లి పూర్తిగా ఉచితంగా శస్త్రచికిత్స చేయించారని తెలిపారు. శస్త్రచికిత్స తర్వాత ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోందని, తమకు మళ్లీ చూపు ఇచ్చిన వైద్యులకు మరియు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన రుద్ర ఫౌండేషన్ ఛైర్మన్ పేరం గోపీకృష్ణకు రోగులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
సేవా కార్యక్రమాలు కొనసాగుతాయి
*రుద్ర ఫౌండేషన్ ఛైర్మన్ పేరం గోపీకృష్ణ
శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తయిన తర్వాత రోగుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి వారిని సురక్షితంగా తిరిగి స్వగ్రామాలకు తీసుకొచ్చారు. రుద్ర ఫౌండేషన్ సభ్యులు స్వయంగా రవాణా ఏర్పాట్లు చేసి వారికి సహాయం చేశారు. ఈ సందర్భంగా రుద్ర ఫౌండేషన్ ఛైర్మన్ పేరం గోపీకృష్ణ మాట్లాడుతూ పేద ప్రజలకు ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు చేసి సేవలందించిన శంకర కంటి ఆసుపత్రి వైద్యులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని ఆయన తెలిపారు. ప్రజలు కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, కంటి సమస్యలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సతీష్, జ్యోతి, రమణాచారి, రాజ్ కుమార్, రాజు, క్రాంతి, వీరచారి, రాము, విక్రమ్, వివేక్, అభిషేక్, అరుణ్, నాగరాజు, స్రవంతి, ఇందు, దీపిక, శ్రావ్య, వెంకన్న, రామకృష్ణ, తిరుపతి, సంపత్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. స్థానికులు కూడా ఈ సేవా కార్యక్రమాన్ని అభినందిస్తూ రుద్ర ఫౌండేషన్ చేపట్టిన సేవలను ప్రశంసించారు.


