తాగునీటి సమస్య రావొద్దు
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
ఎల్కతుర్తిలో ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యాచరణపై సమీక్ష
జెండర్ రిసోర్స్ భవనం ప్రారంభించిన మంత్రి
కాకతీయ, వరంగల్ బ్యూరో: గ్రామాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ అధికారులను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. మంగళవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంపై మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై మంత్రి సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు పారదర్శకమైన, సమర్థవంతమైన పాలన అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. పది ముఖ్య అంశాలతో రూపొందించిన ఈ కార్యక్రమం మార్చి 6 నుండి జూన్ 12 వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

తాగునీటి సమస్యలను ముందుగానే గుర్తించాలి
గ్రామాల్లో తాగునీటి సమస్యలను ముందుగానే గుర్తించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని ఆరోగ్య ఉపకేంద్రాలలో కాకతీయ మెడికల్ కళాశాల, జిల్లా వైద్య ఆరోగ్యశాఖల సమన్వయంతో వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు తుదిదశకు చేరుకున్న వాటిని త్వరగా పూర్తి చేసి గృహప్రవేశాలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. ఇండ్లు మంజూరైన కొంతమంది లబ్ధిదారులు ఇంకా మార్కింగ్ చేయించుకోలేదని, వారు వెంటనే మార్కింగ్ చేయించుకుని పనులు ప్రారంభించాలని అన్నారు. గ్రామాల్లో ఇండ్ల నిర్మాణ పనులను సర్పంచులు, గృహనిర్మాణ శాఖ అధికారులు పర్యవేక్షిస్తూ వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఇండ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత ఏప్రిల్లో మరిన్ని ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు.
విద్యార్థుల సంఖ్య పెరగాలి
2026–27 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య పెరగాలని మంత్రి పేర్కొన్నారు. గ్రామాల్లో చదువు మానేసిన విద్యార్థులను గుర్తించి తిరిగి పాఠశాలల్లో చేర్పించాలని అధికారులకు ఆదేశించారు. విద్య ద్వారానే వ్యక్తి ఉన్నత స్థాయికి చేరుకోగలరని పేర్కొంటూ ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలకు చెందిన డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేయాలని రవాణా శాఖ అధికారులకు సూచించారు. త్వరలో సర్పంచులు, ఉపసర్పంచులకు హెల్మెట్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి కోరారు.
జెండర్ రిసోర్స్ భవనం ప్రారంభం
అనంతరం ఎల్కతుర్తిలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన జెండర్ రిసోర్స్ భవనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని, ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని అన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు మహిళా సంఘాల ద్వారా స్టీల్ బ్యాంకులను పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రజా పాలన ప్రభుత్వంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ రవి, జిల్లా పరిషత్ సీఈవో శేషాద్రి, మిషన్ భగీరథ ఎస్ఈ చలమారెడ్డి, డీఈవో గిరిరాజ్ గౌడ్, డీఆర్డీఓ మేన శ్రీను, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య, రవాణా శాఖ డీటీసీ సురేష్ రెడ్డి, కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి, తహసీల్దార్ ప్రసాదరావు, ఎంపీడీవో విజయ్ కుమార్, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.


