బిగ్ ప్రైజ్మనీ
భారత జట్టుకు 131 కోట్ల నగదు బహుమతి
బీసీసీఐ చరిత్రలోనే అతిపెద్ద ప్రైజ్ మనీ
ఐసీసీ నుంచి కూడా భారీ నగదు బహుమతి
కాకతీయ, స్పోర్ట్స్ : టీ-20 ప్రపంచకప్ 2026 విజేతగా నిలిచిన భారత జట్టుకు బీసీసీఐ భారీ నగదు బహుమతిని ప్రకటించింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని భారత జట్టుకు 131 కోట్ల రూపాయల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు బోర్డు ప్రకటించింది. ఇది బీసీసీఐ చరిత్రలో ఇప్పటివరకు ప్రకటించిన అత్యధిక నగదు బహుమతి కావడం విశేషం. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో భారత జట్టు న్యూజిలాండ్ను ఓడించి టైటిల్ను కైవసం చేసుకుంది. దీంతో వరుసగా రెండోసారి టి ట్వంటీ ప్రపంచకప్ను గెలుచుకున్న తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో భారత్ మొత్తం మూడు సార్లు టి ట్వంటీ ప్రపంచకప్ గెలిచిన జట్టుగా కూడా నిలిచింది. ఈ చారిత్రాత్మక విజయాన్ని గుర్తిస్తూ భారత ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, సెలెక్టర్లను బీసీసీఐ అభినందించింది. జట్టు ప్రదర్శన దేశానికి గర్వకారణమని బోర్డు పేర్కొంది. భవిష్యత్తులో కూడా ఇలాగే విజయాలు సాధించాలని ఆకాంక్షించింది. ఇంతకుముందు జరిగిన టి ట్వంటీ ప్రపంచకప్లో కూడా బీసీసీఐ భారీ నగదు బహుమతి ప్రకటించింది. 2024లో రోహిత్ శర్మ నాయకత్వంలో భారత్ టైటిల్ గెలిచినప్పుడు 125 కోట్ల రూపాయల నగదు బహుమతిని ప్రకటించింది. ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొడుతూ 131 కోట్ల బహుమతిని ప్రకటించింది. ఇక అంతర్జాతీయ క్రికెట్ మండలి కూడా విజేత జట్టుకు భారీ నగదు బహుమతిని అందించింది. ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు సుమారు 3 మిలియన్ డాలర్లు, అంటే దాదాపు 27.48 కోట్ల రూపాయల నగదు బహుమతి అందింది. అదనంగా గ్రూప్ దశ మరియు సూపర్ 8 మ్యాచ్లలో గెలిచిన ప్రతి మ్యాచ్కు ప్రత్యేక బోనస్ కూడా జట్టుకు లభించింది. ఈసారి మొత్తం టోర్నమెంట్ ప్రైజ్ పూల్ కూడా భారీగా పెరిగింది. మొత్తం 13.5 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీతో ఈ టోర్నమెంట్ నిర్వహించారు.


