యుద్ధం మొచ్చినా ఆట ఆగదు..!
వరల్డ్ ఫుట్ బాల్ టోర్నీపై ఫిఫా స్పష్టత
టోర్నమెంట్ వాయిదా వార్తలపై ఖండన
జూన్ 11 నుంచి 48 దేశాల పోటీలు
అమెరికా, మెక్సికో, కెనడా వేదికలు
ప్రయాణ ఆంక్షల మధ్య జట్లకు మినహాయింపు
కాకతీయ,స్పోర్ట్స్ : ప్రపంచ రాజకీయ పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ ఫుట్బాల్ ప్రపంచ కప్ షెడ్యూల్లో ఎలాంటి మార్పు ఉండదని ఫీఫా స్పష్టం చేసింది. అమెరికా–ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్తో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో టోర్నమెంట్ వాయిదా పడుతుందా అనే చర్చ జరుగుతున్న వేళ ఫీఫా వరల్డ్ కప్ చీఫ్ ఆపరేటింగ్ అధికారి హైమో షిర్గి కీలక వ్యాఖ్యలు చేశారు. జూన్ 11 నుంచి ప్రారంభమయ్యే ప్రపంచ కప్ను వాయిదా వేయడం అసాధ్యమని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా వేడుకలలో ఒకటని ఆయన స్పష్టం చేశారు. పరిస్థితులు రోజురోజుకూ మారుతున్నా ఫీఫా అన్ని అంశాలను దగ్గరగా గమనిస్తోందని చెప్పారు.
పరిస్థితిని గమనిస్తున్న ఫీఫా
అమెరికాలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ బ్రాడ్కాస్ట్ సెంటర్లో మీడియాతో మాట్లాడిన షిర్గి, ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను నిరంతరం సమీక్షిస్తున్నామని తెలిపారు. అమెరికా ప్రభుత్వం, భద్రతా సంస్థలు, అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పరిస్థితిని పరిశీలిస్తున్నామని చెప్పారు. వరల్డ్ కప్ చాలా పెద్ద టోర్నమెంట్ కాబట్టి దాన్ని వాయిదా వేయడం సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. ఈసారి వరల్డ్ కప్ను 48 దేశాలకు విస్తరించారు. గతంలో 32 దేశాలతో జరిగే టోర్నమెంట్ను మరింత విస్తరించి నిర్వహిస్తున్నారు. అమెరికాలో 11 వేదికలు, మెక్సికోలో 3 వేదికలు, కెనడాలో 2 వేదికల్లో మ్యాచ్లు జరుగుతాయి. అమెరికాలోని డల్లాస్లో కూడా అనేక మ్యాచ్లు నిర్వహించనున్నారు. అక్కడి స్టేడియంలో మొత్తం తొమ్మిది మ్యాచ్లు జరగనున్నాయి. అమెరికా ప్రభుత్వం ఇరాన్, ఐవరీ కోస్ట్, హైటి, సెనెగల్ వంటి కొన్ని దేశాలపై ప్రయాణ ఆంక్షలు విధించినప్పటికీ వరల్డ్ కప్లో పాల్గొనే ఆటగాళ్లు, జట్టు అధికారులు, వారి కుటుంబ సభ్యులకు మాత్రం మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇరాన్ ఫుట్బాల్ సమాఖ్యతో ఫీఫా నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తోందని షిర్గి తెలిపారు. అయితే ఆ చర్చల వివరాలను వెల్లడించలేదు.


