గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి
కలెక్టర్ గరిమ అగ్రవాల్
చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో పశువులకు టీకాల పంపిణీ
ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక పనుల పరిశీలన
కాకతీయ సిరిసిల్ల టౌన్: పశువుల సంరక్షణకు పెంపకందారులు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పకుండా వేయించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో జాతీయ పశు వ్యాధుల నివారణ కార్యక్రమాన్ని పశు వైద్య, పశు సంవర్ధక శాఖ ఆద్వర్యంలో పాల కేంద్రం ఆవరణలో మంగళవారం నిర్వహించగా, ముఖ్య అతిథిగా కలెక్టర్ గరిమ అగ్రావాల్ హాజరై ప్రారంభించారు. పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు.పాల కేంద్రాన్ని పరిశీలించి గ్రామంలో ఎన్ని పాడి పశువులు ఉన్నాయి? ఎన్ని లీటర్ల పాలు వస్తాయి? ఎక్కడ విక్రయిస్తారు అనే వివరాలను పాల కేంద్రం నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.అలాగే ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక లో భాగంగా గ్రామంలో కొనసాగుతున్న పనులపై ఆరా తీశారు. అధికారులకు పలు సూచనలు చేశారు.రోగాల బారిన పడిన పాడి పశువులు పాలు తక్కువ ఇస్తాయని వివరించారు. పాలు, పాల ఎగుమతుల పై ఆ ప్రభావం పడుతుందని స్పష్టం చేశారు. పెంపకందారులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంటుందని తెలిపారు. పెంపకందారులు తమ జీవాల ఆరోగ్య సంరక్షణ, ఆర్థికంగా నష్ట పోకూడదనే ఉద్దేశంతో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ప్రభుత్వం ఉచితంగా వేయిస్తుందని పేర్కొన్నారు. పెంపకందారులు ముందస్తుగా టీకాలు వేయించి ఆ రోగాల బారి నుంచి తమ జీవాలను రక్షించాలని సూచించారు.

అన్ని పాడి పశువులు, ఎద్దులు, దూడలకు పశువుల పెంపకందారులు, రైతులు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని, జిల్లాలో 97 వేల జీవాలు ఉన్నాయని, పశు వైద్య డాక్టర్లు, సిబ్బంది 26 టీమ్ లుగా ఏర్పడి వచ్చే నెల ఏప్రిల్ 9వ తేదీ వరకు టీకాలు వేస్తారని తెలిపారు.
ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో జిల్లాలోని అన్ని గ్రామాలు, రెండు మున్సిపాలిటీల్లో పారిశుధ్య పనులు చేపడుతున్నారని తెలిపారు. గృహ నిర్మాణ శాఖ ఆద్వర్యంలో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తి చేసి గృహ ప్రవేశానికి సిద్దం చేయాలని ఆదేశించారు. మహిళా సమాఖ్య భవనాల నిర్మాణ పనులు వేగంగా పనులు చేపట్టి జూన్ 2వ తేదీలోగా పూర్తి చేయాలని సూచించారు. యూత్ అండ్ స్పోర్ట్స్ ఆధికారి ఆద్వర్యంలో యువతకు 5కే రన్, ఉపాధి కల్పన శాఖ ఆద్వర్యంలో జాబు మేళాలు చేపడుతారని కలెక్టర్ తెలిపారు. వ్యవ సాయ, విద్యాశాఖ, అటవీ శాఖ, డీఆర్డీఓ వివిధ శాఖల ఆద్వర్యంలో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక లో భాగంగా చేపడుతున్న పనుల్లో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

గాలికుంటు వ్యాధి బారిన పడిన జీవాల శరీర ఉష్ణోగ్రత 104º F – 1060 F పెరిగి పశువులు నీరసించి పోతాయని, పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుందని, వాటి నోరు అలాగే గిట్టల మధ్య బొబ్బలు ఏర్పడి, 24 గంటల్లో చితికిపోయి పొక్కులు, పుండ్లుగా మారి నొప్పి వలన పశువులు మేత నీరు తీసుకోక నీరసించి చనిపోయే ప్రమాదం ఉందని పశు వైద్య, పశు సంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. పశువుల పాకలను శుభ్రంగా ఉండాలని సూచించారు. టీకాలు వేసి గుర్తింపు కొరకు చెవి పోగు వేయించి ఆ వివరాలు భారత్ పశుధాన్ యాప్ లో నమోదు చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ దూది మనీషా, మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, ఎంపీడీఓ రాధ, పశు వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


