భగత్ నగర్ ప్రజల ప్రేమే నా బలం
డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు
కాకతీయ, కరీంనగర్ భగత్నగర్ : నా వెంట నిలబడి భారీ మెజారిటీతో గెలిపించిన 42వ డివిజన్ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని కరీంనగర్ డిప్యూటీ మేయర్ (మాజీ మేయర్) యాదగిరి సునీల్ రావు అన్నారు. మంగళవారం కరీంనగర్ నగరంలోని 42వ డివిజన్ భగత్నగర్ అయ్యప్ప దేవాలయంలో ఆదర్శ యువజన సంఘం, జైభీమ్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఆయనకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు.
ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు హరిహరక్షేత్రంలోని అయ్యప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆదర్శ యూత్ క్లబ్, జైభీమ్ యూత్ క్లబ్ సభ్యులు, స్థానిక ప్రజలు శాలువాలతో సత్కరించి పూల మొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సునీల్ రావు మాట్లాడుతూ.ఎన్నికల సమయంలో నగరంలోని 66 డివిజన్లలో ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడుతారో అనే ఉత్కంఠ నెలకొనగా 42వ డివిజన్ ప్రజలు మాత్రం తన విజయం ఖాయమని నమ్మకంతో ఎదురుచూశారని గుర్తుచేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఏ ఆశలు లేకుండా తన గెలుపు కోసం కృషి చేసిన ఆదర్శ యూత్ క్లబ్, జైభీమ్ యూత్ క్లబ్, చైతన్య యూత్ క్లబ్, భగత్నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో పాటు డివిజన్ ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
గత ఎన్నికల మాదిరిగానే ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా భారీ మెజారిటీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల్లా ప్రేమాభిమానాలు చూపుతూ తనను ముందుకు నడిపిస్తున్న ప్రజలు ఉండటం తన అదృష్టమన్నారు.డివిజన్ ప్రజలంతా ఏకతాటిపై ఉండి ఒక కుటుంబంలా కలిసి మెలిసి ఉండటం వల్లనే వరుస విజయాలు సాధ్యమవుతున్నాయని తెలిపారు. ప్రజల కోసం శక్తి వంచన లేకుండా పనిచేశానని, ఇకముందు కూడా అదే విధంగా సేవలు అందిస్తానన్నారు. డివిజన్లో డ్రైనేజీ, రోడ్లు, పారిశుధ్యం, తాగునీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు.భగత్నగర్ డివిజన్ నగరంలో ఆదర్శంగా నిలుస్తోందని, ఇతర డివిజన్ల ప్రజలు కూడా దీనిని ఆదర్శంగా తీసుకుంటున్నారని అన్నారు. హిందూ, ముస్లిం ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఒకరి పండుగలను ఒకరు గౌరవించుకునే శాంతి వాతావరణం భగత్నగర్ ప్రత్యేకత అని పేర్కొన్నారు. ప్రజలు చూపుతున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా ఎప్పుడూ వెన్నంటి ఉంటానని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తనపై నమ్మకం ఉంచి నగరపాలక సంస్థకు అవసరమైన సూచనలు అందించాలనే ఉద్దేశంతో మళ్లీ డిప్యూటీ మేయర్ పదవి అప్పగించారని తెలిపారు. ఇందుకు భగత్నగర్ ప్రజల తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆదర్శ యూత్ క్లబ్ సభ్యులు డొంకిని జయరాం, సోడే ధనరాజ్, సోమిడి మల్లేశం, బాలు, జైభీమ్ యూత్ క్లబ్ సభ్యులు అరికిల్ల శంకర్, దాసరి రమేష్, అరుణ్ కుమార్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.


