హుజురాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుంది
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక
99 రోజుల కార్యాచరణ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్
కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన 99 రోజుల కార్యాచరణ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా హుజురాబాద్ మున్సిపాలిటీ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించిన రోంటాల సుహాసిని, వైస్ చైర్పర్సన్ గూడూరి అంజలితో పాటు కౌన్సిలర్లకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి ముందు అంబేద్కర్ చౌరస్తాలో డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి అక్కడి నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఉంటాయని, ఎన్నికల అనంతరం అభివృద్ధే ప్రధాన లక్ష్యమని చెప్పారు. ప్రజలు అభివృద్ధి ఆకాంక్షించి అధికార పార్టీకి అవకాశం కల్పించారని పేర్కొన్నారు. మున్సిపల్ పాలకవర్గం తీసుకునే అభివృద్ధి నిర్ణయాలకు ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు.హుజురాబాద్ పట్టణ అభివృద్ధికి సుమారు రూ.300 కోట్ల ప్రతిపాదనలు మున్సిపల్ చైర్పర్సన్ సమర్పించారని తెలిపారు. జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి పట్టణాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని చెప్పారు. తాను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలో కూడా హుజురాబాద్, జమ్మికుంట ప్రాంతాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు గుర్తు చేశారు.ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా మార్చి 6 నుండి జూన్ 12 వరకు 99 రోజుల కార్యాచరణ చేపట్టినట్టు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిసరాల పరిశుభ్రత, నో డ్రగ్స్ అవగాహన, భద్రత, పెండింగ్ ఫైళ్ల పరిష్కారం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు.

మహిళా సంఘాల సభ్యులు తమ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. వ్యర్థాల నిర్వహణలో భాగంగా పాడైన టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మెషీన్లు వంటి వస్తువులను రీసైక్లింగ్కు ఇవ్వాలని సూచించారు. వచ్చే వర్షాకాలంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.ప్లాస్టిక్ రహిత సమాజం కోసం అందరూ కలిసి పని చేయాలని, వీలైనంతవరకు స్టీల్ వస్తువులు ఉపయోగించాలని సూచించారు. ప్రజల సహకారంతోనే ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతమవుతాయని చెప్పారు.రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు పోలీస్ మరియు రవాణా శాఖలు కలిసి ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయని తెలిపారు. యువత నో డ్రగ్స్కు కట్టుబడి గంజాయి వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. పిల్లల భద్రత, విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలని కోరారు.రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని చెప్పారు. మహిళా సంఘాల ద్వారా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, సోలార్ పవర్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు నిర్వహించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు.
హుజురాబాద్ మున్సిపల్ పాలకవర్గం ప్రతి రోజు ఒక కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజా పాలన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నట్టు మంత్రి అభినందించారు. ఈ ప్రాంత మాజీ పార్లమెంట్ సభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా హుజురాబాద్ అభివృద్ధికి ఎప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లాలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో హుజురాబాద్ ముందుండాలని ఆకాంక్షించారు.


