ప్రగతిలో ముందుండాలి
తాగునీటి సమస్యపై ముందస్తు చర్యలు తీసుకోవాలి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి
ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాలి
ప్రతి ఒక్కరికీ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలి
గ్రామాల అభివృద్ధికి లక్ష్యంతో ముందుకు సాగాలి
అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం
కాకతీయ, కరీంనగర్ : ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక అమలులో చిగురుమామిడి, సైదాపూర్ మండలాలను రాష్ట్రంలోనే ముందుండేలా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సోమవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో నిర్వహించిన మండల స్థాయి సన్నాహక సమావేశాల్లో పాల్గొన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక గ్రామాల అభివృద్ధికి గొప్ప అవకాశమని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, మండల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.
ఇసుక సరఫరాలో ఇబ్బందులొద్దు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి లబ్ధిదారులకు త్వరగా గృహప్రవేశాలు కల్పించాలని మంత్రి సూచించారు. నిర్మాణ పనులకు అవసరమైన ఇసుక సరఫరా విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తామని, ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను పంపే గ్రామాలకు ప్రత్యేక అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతి వ్యక్తికి సంబంధించిన ఆరోగ్య వివరాలతో హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేసి ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రజల ఆరోగ్యం బాగుంటేనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో లెక్టర్ చిత్రా మిశ్రా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, ఆర్డీవో మహేశ్వర్, డీపీవో జగదీశ్వర్, డీఆర్డీవో శ్రీధర్, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, సంక్షేమ అధికారి సరస్వతి, హౌసింగ్ పీడీ శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా, మండలస్థాయి అధికారులు, సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు.


