ఎన్టీపీసీకి స్వేచ్ఛ ఇవ్వాలి
తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవాలి
ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గును సమీకరించుకోవాలి
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విజ్ఞప్తి
రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టుపై లేఖ
కాకతీయ, కరీంనగర్ : రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న 3×800 మెగావాట్ల సామర్థ్యంతో 2,400 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) చేసుకోవాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికు లేఖ రాశారు. రామగుండంలో మొత్తం 5,800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గు సమీకరణలో ఎన్టీపీసీకి తగిన స్వేచ్ఛ ఇవ్వాలని కూడా కోరారు. రామగుండంలో ఏర్పాటు చేయనున్న 4,000 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టులో తొలి దశగా రూ.12,000 కోట్ల వ్యయంతో అల్ట్రా సూపర్ క్రిటికల్ సాంకేతికతతో నిర్మించిన 2×800 మెగావాట్ల (1,600 మెగావాట్ల) రెండు యూనిట్లను 2023లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేసిన విషయం గుర్తు చేశారు.

విద్యుత్ డిమాండ్ పెరుగుదలపై ఆందోళన
తొలి దశ అనంతరం రెండో దశలో భాగంగా 3×800 మెగావాట్ల సామర్థ్యంతో మిగిలిన మూడు యూనిట్లను పూర్తి చేయడానికి ఎన్టీపీసీ చర్యలు చేపట్టిందని లేఖలో పేర్కొన్నారు. మొదటి దశలోలాగే రెండో దశలో ఉత్పత్తి అయ్యే విద్యుత్లో 85 శాతం తెలంగాణ రాష్ట్రానికే సరఫరా చేయనున్నట్లు తెలిపారు. 2026 మార్చి 3న తెలంగాణలో ఇప్పటివరకు లేనివిధంగా 18,139 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైందని రాబోయే రోజుల్లో ఇది మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యుత్ రంగంపై ఇచ్చిన ప్రదర్శనలో గ్రిడ్ స్థిరత్వం కోసం రాష్ట్రంలో 5,000 నుంచి 6,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి పెంపు అవసరం ఉందని తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే 2047 నాటికి రాష్ట్రంలో లక్ష మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండొచ్చని కూడా పేర్కొన్నారని తెలిపారు. దీనికి అనుగుణంగా రాష్ట్రంలో 2,400 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు కూడా లేఖలో ప్రస్తావించారు.
ఎన్టీపీసీ అనుభవం, పీపీఏ అవసరం
అధునాతన అల్ట్రా సూపర్ క్రిటికల్ సాంకేతికతతో తక్కువ ఖర్చులో నాణ్యమైన విద్యుత్ ఉత్పత్తి చేయడంలో ఎన్టీపీసీకి విశేష అనుభవం ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. గతంలో రాష్ట్ర శాసనసభలో విద్యుత్ రంగంపై జరిగిన చర్చలో భాగంగా రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రశంసించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. పూర్తి 5,800 మెగావాట్ల ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గు సమీకరణలో ఎన్టీపీసీకి స్వేచ్ఛ ఇస్తే తక్కువ ధరకే నాణ్యమైన విద్యుత్ ఉత్పత్తి చేసి తెలంగాణ విద్యుత్ అవసరాలను తీర్చేందుకు ఎన్టీపీసీ సిద్ధంగా ఉందని తెలిపారు. ఇప్పటికే ఇతర దక్షిణాది రాష్ట్రాలు కూడా ఎన్టీపీసీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. అందువల్ల రామగుండం రెండో దశ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రభుత్వం పీపీఏ కుదుర్చుకునేలా మీరు వ్యక్తిగతంగా చొరవ తీసుకోవాలని, ఈ ప్రాజెక్టుకు సహకరించాలని కిషన్ రెడ్డి తన లేఖలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.


