విన్నపాలు విడిచి
పన్నుల వేట!
వెలవెలబోయిన జీడబ్ల్యూఎంసీ గ్రీవెన్స్ ..
పూర్తిస్థాయిలో హాజరుకాని అధికారులు
ఆఫీసర్ల తీరుపై బాధితుల ఆగ్రహం
కాకతీయ, వరంగల్: ప్రజా సమస్యల పరిష్కారం కోసమే నిర్వహిస్తున్నామంటున్న గ్రీవెన్స్ సెల్ సోమవారం వరంగల్ మహానగర పాలక సంస్థలో వెలవెలబోయింది. తమ గోడు వెళ్లబోసుకునేందుకు ప్రజలు తరలివచ్చినా.. అధికారులు మాత్రం పూర్తిస్థాయిలో హాజరుకాకపోవడంతో నిరాశకు లోనయ్యారు. అదనపు కమిషనర్ చంద్రశేఖర్ తోపాటు మరో అధికారీ మాత్రమే గ్రీవెన్స్ సెల్ కు హాజరయ్యారు. అయితే, మార్చి నెల.. ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో చాలామంది అధికారులు పన్నుల వేటలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గ్రీవెన్స్ సెల్స్ ను విస్మరించి.. పన్నుల వసూళ్లకే ప్రాధాన్యం ఇవ్వడం పట్ల గ్రీవెన్స్ సందర్శకుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజల సమస్యలను గాలికొదిలేసి.. పన్నుల కోసం అధికారులు గైర్హాజర్ కావడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఇక గ్రీవెన్స్కు మొత్తం 53 అర్జీలు రాగా, టౌన్లానింగ్ విభాగానికి 21, ఇంజనీరింగ్ 16, రెవెన్యూ 4, హెల్త్ అండ్ శానిటేషన్ 7, నీటి సరఫరా 4, హార్టికల్చర్ విభాగానికి 1 వినతులు అందాయి. కార్యక్రమంలో ఇంచార్జి సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, తదితరులు పాల్గొన్నారు.
వినతుల వివరాలిలా..
ఉర్సు కుమ్మరివాడ శివారులో శ్మశానవాటికకు వెళ్లే సీసీ రోడ్డును కొందరు జేసీబీతో ధ్వంసం చేసినట్లు స్థానికులు గ్రీవెన్స్ కు ఫిర్యాదు చేశారు. బాధ్యులైన వారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
27వ డివిజన్ దళితకాలనీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు అర్ధంతరంగా రద్దు కావడాన్ని ఆక్షేపిస్తూ స్థానిక కార్పొరేటర్ చింతాకుల అనిల్కుమార్ బల్దియా గ్రీవెన్స్ ను ఆశ్రయించారు. పనులపై అగ్రిమెంట్ జరిగాక, రద్దు కావడం ఏమిటని ప్రశ్నించారు. అందుకు గల కారణాలు, కారకులు ఎవరనే విషయంపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
భూ కబ్జా, అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలి
దేశాయిపేట ఏరియా సర్వేనంబర్ 299లో గల తన 20 గుంటల పట్టా భూమిని కొందరు ఆక్రమించి, అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని జన్ను నూతన్ బల్దియా అధికారులకు మొరపెట్టుకున్నారు. ఈ విషయమై పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి, తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.
సొసైటీ స్థలం కబ్జా
కాశీబుగ్గ ఏరియాలోని బ్రిక్స్ అండ్ టైల్స్ కో ఆపరేషన్ సొసైటీ స్థలాన్ని కొందరు అక్రమంగా కబ్జా చేయడమే కాకుండా నిర్మాణాలు చేపడుతున్నారని సొసైటీ బాధ్యులు డాక్టర్ సముద్రాల లక్ష్మీనారాయణ విన్నవించారు. గతంలో కొందరు కబ్జా చేస్తుంటే కోర్టుకెళ్లగా, ఆ స్థలం సొసైటీదేననే న్యాయస్థానం తేల్చిందని, అయినా, వెలిశాల మల్లికాంబ పేరిట కొందరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని మళ్లీ ఆక్రమించుకుంటున్నారని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి సొసైటీ స్థలాన్ని పరిరక్షించాలని గ్రీవెన్సెసెల్లో వినతిపత్రం సమర్పించారు.


