గ్యాస్ సిలిండర్ ధరల పెంపు వెంటనే ఉపసంహరించాలి
– సిఐటియు సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు బండ్ల స్వామి డిమాండ్
– పెరిగిన ధరలతో సామాన్య ప్రజలపై తీవ్ర భారం
– వాణిజ్య సిలిండర్ ధరల పెంపుతో చిన్న వ్యాపారులు ఇబ్బంది
– తగ్గించకపోతే ప్రజలతో కలిసి ఉద్యమాలు
కాకతీయ, గజ్వేల్ : కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిఐటియు సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు బండ్ల స్వామి డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ అంతర్జాతీయ పరిస్థితులను కారణంగా చూపుతూ వంట గ్యాస్ ధరలను పెంచడం సరైన విధానం కాదన్నారు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుపై ఆంక్షలు విధించడంతో ఇంధన ధరలు ప్రభావితమయ్యాయని పేర్కొన్నారు. అయితే కారణమేదైనా కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ.60, వాణిజ్య సిలిండర్ ధరను రూ.115 పెంచడం పేద, మధ్యతరగతి ప్రజలకు తీవ్ర భారం మోపిందన్నారు. ఇప్పటికే నిత్యావసరాల ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా గ్యాస్ ధరల పెంపు మరింత భారంగా మారిందన్నారు. గ్యాస్ ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు, హోటళ్లలో భోజనం ధరలు, ఇతర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావం చిన్న వ్యాపారులపై తీవ్రంగా పడుతుందన్నారు. ఒకప్పుడు సబ్సిడీతో అందుబాటులో ఉండే వంట గ్యాస్ ఇప్పుడు వేల రూపాయలు దాటుతోందని విమర్శించారు. అంతర్జాతీయ పరిస్థితులను కారణంగా చూపుతూ ధరలు పెంచే ప్రభుత్వాలు, ధరలు తగ్గినప్పుడు మాత్రం ప్రజలకు ఉపశమనం కల్పించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే గ్యాస్ ధరల పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజలతో కలిసి ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.


