బాలికలకు హెచ్పీవీ టీకాలు అందించాలి
గర్భాశయ క్యాన్సర్ నివారణకు టీకా కీలకం
అర్హులైన బాలికలను గుర్తించి వ్యాక్సినేషన్
జిల్లా ఆసుపత్రులు, సిహెచ్సిల్లో టీకాలు
గ్లకోమాపై అవగాహన కార్యక్రమాలు
అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి
కాకతీయ, ఖమ్మం : అర్హులైన బాలికలకు పూర్తి స్థాయిలో హెచ్పీవీ వ్యాక్సినేషన్ అందించాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమంపై జిల్లా అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. 14 సంవత్సరాలు పూర్తి చేసి 15 సంవత్సరాల లోపు ఉన్న బాలికలకు ఈ టీకా వేయడం ద్వారా గర్భాశయ ముఖ క్యాన్సర్ను నివారించే అవకాశం ఉంటుందని అన్నారు. ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, కల్లూరు, మధిర, పెనుబల్లి, సత్తుపల్లి, వైరా ఏరియా ఆసుపత్రుల్లో ప్రతి రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వ్యాక్సినేషన్ అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో సుమారు 11,460 మంది బాలికలు ఈ వయస్సు గలవారని అంచనా ఉందని చెప్పారు. బాలికల తల్లిదండ్రులకు టీకా వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించి ఎక్కువ మంది టీకా తీసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే మార్చి 8 నుంచి మార్చి 14 వరకు గ్లకోమాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. సమావేశంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.


