విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్
కాకతీయ, కొత్తగూడెం : జిల్లాలోని వసతి గృహ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారంతో కూడిన భోజనం అందించడంతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. సోమవారం ములకలపల్లి మండలంలో పర్యటించిన కలెక్టర్ ములకలపల్లి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం, మూకమామిడి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులను సందర్శించి విద్యార్థుల హాజరు, బోధన పరిస్థితులను పరిశీలించారు. వంటశాల, భోజనశాల, మరుగుదొడ్లు, ఆహార పదార్థాల నాణ్యత, పాఠశాల ఆవరణలో పరిశుభ్రత వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. అనంతరం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులతో మాట్లాడి వారి భవిష్యత్ లక్ష్యాలను తెలుసుకున్నారు. విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాలతో ఉన్నత విద్యలో ముందుకు సాగాలని ప్రోత్సహించారు. పదవ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రీ ఫైనల్ పరీక్షలను కూడా పరిశీలించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాలలో తాగునీటి కోసం ఏర్పాటు చేసిన ఆర్ ఓ నీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించి నీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం అందించాలని, పరిశుభ్రత ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో అధికారులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు


