గజ్వేల్లో అడ్డా కూలీల ఘర్షణ..!
స్థానిక, వలస కూలీల మధ్య ఉద్రిక్తత
కాకతీయ, గజ్వేల్ : సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో అడ్డా కూలీల మధ్య ఆదివారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలోని ఇందిరా పార్క్ చౌరస్తాలో రోజువారీ పనుల కోసం వేచి ఉండే స్థానిక కూలీలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీల మధ్య మాటల తగాదా ఘర్షణకు దారితీసింది. కొంతకాలంగా పనుల కేటాయింపులో వివాదాలు జరుగుతుండగా ఆదివారం ఉదయం పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. గజ్వేల్ పరిసర గ్రామాలకు చెందిన కూలీలు ఆగ్రహంతో వలస కూలీలను కర్రలతో తరిమికొట్టడంతో చౌరస్తా వద్ద భయాందోళనలు నెలకొన్నాయి. ప్రధాన కూడలి కావడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి మరింత ఉద్రిక్తం కాకముందే సంబంధిత అధికారులు, పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. స్థానిక, వలస కూలీలకు సమానంగా అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


