కనిపించకుండా పోయి.. చెరువులో శవాలై తేలి..!
కామారెడ్డి చిన్నారుల మిస్సింగ్ కేసులో విషాదం
సీపాత్ (8), ఆయాత్ (7), మరియం (5) మృతి
పిల్లల తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
మరో ఘటనలో ఇద్దరు బాలురు మిస్సింగ్
దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు
కామారెడ్డిలో కలకలం రేపుతున్న చిన్నారుల అదృశ్యాలు
కాకతీయ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో అదృశ్యమైన ముగ్గురు చిన్నారుల ఘటన విషాదాంతమైంది. కనిపించకుండా పోయిన ముగ్గురు అక్కాచెల్లెళ్లలో ఇద్దరి మృతదేహాలు పట్టణంలోని పెద్ద చెరువులో లభించడంతో జిల్లా వ్యాప్తంగా విషాద వాతావరణం నెలకొంది. మరో చిన్నారి కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం ఆర్బీ నగర్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ కుమార్తెలు సీపాత్ (8), ఆయాత్ (7), మరియం (5) శనివారం ఉదయం కనిపించకుండా పోయారు. ఉదయం తమ తండ్రితో కలిసి దుకాణానికి వెళ్లిన ఈ ముగ్గురు పిల్లలు తిరుగు ప్రయాణంలో ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. చిన్నారులు ఇంటికి రాకపోవడంతో వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. గాలింపు సమయంలో పట్టణంలోని పెద్ద చెరువులో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభించాయి. మూడో చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు, స్థానికులు కలిసి చెరువులో గాలింపు కొనసాగిస్తున్నారు.
తండ్రి విచారణలో
ఈ ఘటనపై అనుమానాస్పద పరిస్థితులు ఉండటంతో పిల్లల తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా కామారెడ్డిలో గత రెండు రోజులుగా చిన్నారుల అదృశ్యాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. శుక్రవారం గోసంగి కాలనీకి చెందిన సింహాద్రి (10), విజయ్ (9) అనే ఇద్దరు బాలురు కూడా కనిపించకుండా పోయారు. వారి కోసం కూడా పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. వరుసగా చిన్నారులు కనిపించకుండా పోవడం స్థానికుల్లో భయాందోళనలు కలిగిస్తోంది. ఈ ఘటనలతో కామారెడ్డి పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చిన్నారుల అదృశ్యాలపై పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.


