మెమోలు వచ్చినా… “అను”భవం మారాధా..!?
కొమ్మాల దేవస్థానంలో మహిళా ఉద్యోగి వింత పోకడలు
డ్రెస్ కోడ్ పట్టించుకోదు… సమయపాలన పాటించదు
తోటి ఉద్యోగులు, భక్తులతో దురుసు ప్రవర్తన ఆరోపణలు
ఉన్నతాధికారులతోనూ తరచూ వాగ్వాదాలు
జాతర సమీక్ష అనంతరం ఎమ్మెల్యేతోనూ వివాదం
పలుమార్లు మెమోలు వచ్చినా మారని తీరు
కాకతీయ, గీసుగొండ : గీసుగొండ మండలంలోని కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి వ్యవహార శైలి మరోసారి చర్చనీయాంశంగా మారింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, సమయపాలన పాటించకపోవడం, డ్రెస్ కోడ్ను పట్టించుకోకపోవడం వంటి అంశాలతో పాటు తోటి ఉద్యోగులు, భక్తులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలుమార్లు మెమోలు జారీ చేసినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు కనిపించకపోవడం ఆలయ వర్గాల్లో అసంతృప్తికి కారణమవుతోంది. దేవస్థానంలో పనిచేసే ఉద్యోగి అయినప్పటికీ అధికారిక బాధ్యతలను మించి వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఉద్యోగుల మాటల్లో ఆమె ధర్మకర్తలా వ్యవహరిస్తూ నిర్ణయాల్లో జోక్యం చేసుకుంటున్నారని చెబుతున్నారు. ఆలయంలో జరుగుతున్న పనుల్లో అనవసరంగా జోక్యం చేసుకుంటూ సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఉద్యోగా…? లేక ధర్మకర్తనా?
ఆమె అధికారికంగా ఒక ఉద్యోగి మాత్రమే అయినప్పటికీ ఆలయ వ్యవహారాల్లో అధిక ప్రాధాన్యం చూపిస్తూ నిర్ణయాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆలయ సిబ్బంది అంటున్నారు. ఇటీవల నిర్వహించిన జాతర సమీక్ష సమావేశంలోనూ ఎవరి అనుమతి లేకుండా వేదికపై కూర్చోవడం కూడా చర్చనీయాంశమైంది. దీనిపై ఆలయ సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ పరిస్థితి మారడం లేదని చెబుతున్నారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ పాటించాల్సిన ఉద్యోగి ఇలా వ్యవహరించడం ఆలయ ప్రతిష్టకు భంగం కలిగిస్తోందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
ఉన్నతాధికారులతోనూ వివాదాలు
సంబంధిత మహిళా ఉద్యోగి ఉన్నతాధికారులతో కూడా తరచూ వాగ్వాదాలకు దిగుతున్నట్లు సమాచారం. విధి నిర్వహణకు సంబంధించిన అంశాలపై పలుమార్లు వివాదాలు చోటు చేసుకున్నాయని చెబుతున్నారు. జాతర సమయంలో ఇతర శాఖల అధికారులతో కూడా ఆమె దురుసుగా మాట్లాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కొమ్మాల జాతర అనంతరం నిర్వహించిన సమీక్ష సమావేశం తర్వాత స్థానిక ఎమ్మెల్యేతో కూడా ఆమె వాగ్వాదానికి దిగిన ఘటన చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనతో ఆలయ వ్యవహారాలు మరింత వివాదాస్పదంగా మారాయని స్థానికులు అంటున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, ప్రవర్తనపై గతంలో పలుమార్లు మెమోలు జారీ చేసినప్పటికీ ఆమె తీరు మారలేదని ఆలయ వర్గాలు చెబుతున్నాయి. ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నప్పటికీ పరిస్థితి యథాతథంగానే కొనసాగుతోందని అంటున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని ఆలయ సిబ్బంది, స్థానికులు కోరుతున్నారు. దేవస్థానం ప్రతిష్ట దెబ్బతినకుండా క్రమశిక్షణతో వ్యవహరించేలా చర్యలు అవసరమని వారు సూచిస్తున్నారు.


