మహిళా కాంగ్రెస్కు స్వర్ణ యుగం..!
తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
వరంగల్ తూర్పు రాజకీయాల అలజడిలో కీలక నిర్ణయం
నిన్నటి వరకు పక్కన పెట్టినట్లుగా జోరుగా ప్రచారం
అనూహ్యంగా రాష్ట్ర అధ్యక్షురాలి పదవి దక్కించుకున్న స్వర్ణ
మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్లో చురుకైన సేవలు
వరంగల్ మేయర్గా పనిచేసిన అనుభవం
కాంగ్రెస్లో మహిళా ప్రాధాన్యం పెంచుతున్న నేపథ్యంలో సీనియర్కు కీలక పదవి
మహిళా కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యం : స్వర్ణ
కాకతీయ, తెలంగాణ బ్యూరో / వరంగల్ బ్యూరో : తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో అనూహ్యమైన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వరంగల్కు చెందిన ఎర్రబెల్లి స్వర్ణను నియమిస్తూ పార్టీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కె సి వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఈ నియామకానికి ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇటీవలి కాలంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల మధ్య ఈ నియామకం రావడం జిల్లాలో పెద్ద చర్చకు దారితీసింది. నిన్నటి వరకు పార్టీ కార్యక్రమాల్లో ఆమెకు పెద్దగా ప్రాధాన్యం లేదనే ప్రచారం సాగుతుండగా ఒక్కసారిగా రాష్ట్ర స్థాయి కీలక పదవి దక్కడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. కాంగ్రెస్ పార్టీలో మహిళలకు మరింత ప్రాధాన్యం కల్పించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. ఎర్రబెల్లి స్వర్ణకు ఉన్న రాజకీయ అనుభవం, పార్టీ పట్ల ఉన్న నిబద్ధతను దృష్టిలో పెట్టుకుని ఆమెకు ఈ బాధ్యతలను అప్పగించినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళా కాంగ్రెస్ కార్యకలాపాలకు కొత్త ఉత్సాహం వస్తుందని పార్టీ నాయకులు భావిస్తున్నారు.

మూడు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం
ఎర్రబెల్లి స్వర్ణ కాంగ్రెస్ పార్టీలో మూడు దశాబ్దాలకు పైగా చురుకుగా పనిచేస్తున్న నాయకురాలు. తొంభై దశకంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొంటూ వచ్చారు. పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో పనిచేస్తూ కార్యకర్తలతో సన్నిహితంగా మెలిగారు. స్థానిక సంస్థల స్థాయి నుంచి ఆమె రాజకీయ ప్రయాణం ప్రారంభమైంది. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్గా గెలిచి రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం వరంగల్ మేయర్గా బాధ్యతలు చేపట్టి పట్టణ అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టారు. మేయర్గా ఉన్న సమయంలో రహదారులు, మౌలిక వసతులు, తాగునీటి సరఫరా, పట్టణ సౌకర్యాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. నగర అభివృద్ధికి తీసుకున్న నిర్ణయాలు అప్పట్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాయని స్థానిక నాయకులు గుర్తుచేస్తున్నారు. అంతేకాకుండా రైతులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించేందుకు కూడా ఆమె కీలక పాత్ర పోషించారు. వార్ధన్నపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్పర్సన్గా పనిచేసి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. అదే సమయంలో వరంగల్లోని ఒరుగల్లు మార్కెటింగ్ సొసైటీ డైరెక్టర్గా కూడా బాధ్యతలు నిర్వహించారు.
పార్టీలో కీలక బాధ్యతలు
కాంగ్రెస్ పార్టీలో ఎర్రబెల్లి స్వర్ణ పలు కీలక పదవులను నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో పార్టీ కార్యకలాపాల్లో భాగస్వామ్యం అవుతూ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యురాలిగా దీర్ఘకాలం పనిచేశారు. ఆ తరువాత రాష్ట్ర మహిళా కాంగ్రెస్లో కూడా కీలక బాధ్యతలు నిర్వహించారు. మహిళా నాయకత్వాన్ని బలోపేతం చేసే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గానికి పార్టీ తరఫున పనిచేస్తూ స్థానిక నాయకులతో సమన్వయం సాధించారు. రాష్ట్ర రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం పెంచేందుకు నిర్వహించిన పలు కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొన్నారు. మహిళలను రాజకీయాల్లో ముందుకు తీసుకురావాలన్న లక్ష్యంతో పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో విస్తరించే ప్రయత్నాలు చేశారు. ఇటీవలి కాలంలో పార్టీ నిర్వహించిన పాదయాత్రలు, ప్రజా ఉద్యమాల్లో కూడా ఆమె చురుకుగా పాల్గొన్నారు. రాష్ట్ర నాయకత్వం చేపట్టిన కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతూ పార్టీకి మద్దతు తెలిపారు.
వరంగల్ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు
వరంగల్ జిల్లా రాజకీయాల్లో ఎర్రబెల్లి స్వర్ణకు ప్రత్యేక గుర్తింపు ఉంది. రాజకీయాల్లో సంయమనంతో వ్యవహరించే నాయకురాలిగా ఆమెకు పేరుంది. వివిధ వర్గాల మధ్య సమన్వయం సాధిస్తూ ముందుకు సాగడం ఆమె ప్రత్యేకతగా చెప్పబడుతుంది. పార్టీలో వచ్చిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తూ కార్యకర్తలకు చేరువగా ఉండే నాయకురాలిగా గుర్తింపు పొందారు. స్థానిక సమస్యల పరిష్కారంలో కూడా ఆమె చురుకుగా పాల్గొంటూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇటీవల నెలకొన్న రాజకీయ పరిస్థితుల మధ్య ఆమెకు రాష్ట్ర స్థాయి బాధ్యతలు రావడం జిల్లాలో కొత్త చర్చకు దారితీసింది. కాంగ్రెస్ పార్టీలో మహిళలకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ నియామకం మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైన సందర్భంగా ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ మహిళలను రాజకీయాల్లో మరింత ముందుకు తీసుకురావడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళా కాంగ్రెస్ను బలోపేతం చేయడానికి కృషి చేస్తానని చెప్పారు. పార్టీ కార్యక్రమాలను గ్రామ స్థాయి వరకు విస్తరించడంతో పాటు మహిళల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మహిళలకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించేందుకు కృషి చేస్తానని ఆమె తెలిపారు. తెలంగాణలో మహిళా కాంగ్రెస్ కార్యకలాపాలకు కొత్త దిశను చూపించేలా పనిచేస్తానని, మహిళలు రాజకీయాల్లో ముందుకు రావడానికి పార్టీ వేదికగా నిలుస్తుందని స్వర్ణ ఆశాభావం వ్యక్తం చేశారు.


