ముత్తోజిపేట వద్ద ఎక్సైజ్ తనిఖీలు
నాటుసారా ముడి పదార్థాలు స్వాధీనం
కాకతీయ. నల్లబెల్లి: వరంగల్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి అరుణ్ కుమార్ ఆదేశాల మేరకు నర్సంపేట ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాటుసారా నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. ఇందులో భాగంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. నాటుసారా తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన అధికారులు, ఖచ్చితమైన సమాచారంతో నర్సంపేట మండలం ముత్తోజిపేట వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో నల్లబెల్లి మండలం బుచ్చిరెడ్డిపల్లెకు చెందిన బానోతు రాజన్న కారులో బెల్లం, పట్టిక రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి 300 కేజీల పట్టిక, 100 కేజీల బెల్లం, 5 లీటర్ల నాటుసారా, టాటా విస్టా కారు, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో నర్సంపేట ఎక్సైజ్ స్టేషన్ ఎస్సైలు నరేష్ రెడ్డి, శార్వాణితోపాటు సిబ్బంది పాల్గొన్నారు.


