రేషన్ డీలర్పై కేసు నమోదు
తనిఖీలో 60 క్వింటాళ్లకు పైగా నిల్వ తేడా గుర్తింపు
కాకతీయ, చింతకాని : మండలంలోని నాగిలిగొండ గ్రామంలో ఉన్న రేషన్ దుకాణాన్ని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణంలో ఉండాల్సిన ధాన్యం నిల్వలో భారీ తేడా ఉన్నట్లు గుర్తించారు. తనిఖీలో భాగంగా రికార్డుల ప్రకారం దుకాణంలో 112.61 క్వింటాళ్ల ధాన్యం ఉండాల్సి ఉండగా, కేవలం 52.50 క్వింటాళ్లు మాత్రమే ఉన్నట్లు వెల్లడైంది. అంటే సుమారు 60.11 క్వింటాళ్ల ధాన్యం తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనిని తీవ్ర నేరంగా పరిగణించి సంబంధిత రేషన్ డీలర్పై వెంటనే ఆరు ఎ కేసుతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాల డీలర్లు నిబంధనల ప్రకారం సరుకులను పంపిణీ చేయాలని హెచ్చరించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకు అందాల్సిన నిత్యావసర సరుకులను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాలపై నిరంతర తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.


