కమనీయం వెంకటేశ్వరస్వామి కళ్యాణం
కాకతీయ,నర్సింహులపేట: మండల కేంద్రంలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువుదీరిన చిన్న తిరుపతిగా ఖ్యాతిగాంచిన శ్రీవెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా బుధవారం రాత్రి 11 గంటలకు స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారికి నిర్వహించిన ఈమహోత్సవాన్ని ప్రధాన అర్చకులు పరశురాం నందనాచార్యులు, రామాచార్యులు, పవనాచార్యులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ముందుగా గ్రామంలో ఇంటింటా తలంబ్రాల బియ్యం సేకరించి ఆలయానికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను గరుడవాహనంపై పల్లకిలో ఊరేగిస్తూ నిర్వహించిన ఎదుర్కోలు ఉత్సవం కనుల పండువగా సాగింది. ముంగిమడుగు గ్రామానికి చెందిన ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ మెరుగు సత్యనారాయణ, విమలమ్మ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించగా, దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో పుస్తెమట్టెలు సమర్పించారు. శాంతి భద్రతల దృష్ట్యా ఎస్సై మాలోతు సురేష్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ వేముల విజయ్ పాల్ రెడ్డి, తహసీల్దార్ రమేష్ బాబు, దేవాదాయ ధర్మదాయ శాఖ ఇన్స్పెక్టర్ అనిల్, ధర్మకర్తలు గాడుదల సోమలింగం, ఉంగరాల మధుసూదన్, ధర్మారపు వెంకన్న, భూక్య జ్యోతి వీరన్న,మేక సుధాకర్ రెడ్డి, సర్పంచ్ పెదమాముల యాకయ్య, ఉప సర్పంచ్ కాస యాకయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జినుకల రమేష్, ఆలయ కార్యనిర్వాహణాధికారి ఎన్ వెంకట్రావు, జూనియర్ అసిస్టెంట్ మార్కశేఖర్, శాశ్వత కళ్యాణ దాతలు, వివిధ గ్రామాల సర్పంచులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.



