ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు
చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్
కాకతీయ, ఖిలా వరంగల్: చింతల్ గ్రౌండ్ నుండి ఖిలా వరంగల్ తూర్పు కోటకు వెళ్లే ప్రధాన రహదారిపై విద్యుత్ స్థంబాలు ప్రమాదకరంగా మారాయి. ఈ మార్గంలో ఒక విద్యుత్ స్తంభం ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొనగా, మరో రెండు స్తంభాలు కూడా ఒరిగి ఉండటం వాహనదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ప్రతిరోజూ ఈ దారిలో పెద్ద సంఖ్యలో వాహనాలు, స్థానికులు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ఒరిగి ఉన్న విద్యుత్ స్తంభాలు ఎప్పుడు పడతాయో అనే భయంతో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు స్పందించి ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలు వెంటనే సరిచేయాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు. లేదంటే ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


