ఖమ్మంలో 6న జాబ్ మేళా
ప్రైవేట్ రంగంలో 322 ఉద్యోగాలు
కాకతీయ, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 6న ఉదయం 10 గంటలకు ఖమ్మంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ కేంద్రం టేకులపల్లి ప్రాంగణంలోని మోడల్ కెరీర్ సెంటర్ లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి మాధవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేట్ రంగంలోని ఔషధ సంస్థలో ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు ఫార్మసీ అర్హత ఉన్న అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైన వారికి నెలకు 19 వేల నుంచి 25 వేల వరకు వేతనం అందుతుందని తెలిపారు. అలాగే వినియోగదారుల సేవా ప్రతినిధి, జూనియర్ సహాయకుడు, ఆడిట్ సహాయకుడు వంటి ఉద్యోగాలకు పదో తరగతి, ఇంటర్ లేదా ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ పోస్టులకు 12 వేల 756 నుంచి 14 వేల 500 వరకు వేతనం ఉంటుందని తెలిపారు. మొత్తం 322 ఉద్యోగాల భర్తీ కోసం ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్ లో ఉద్యోగాలు ఉండటంతో పాటు ఉచిత వసతి సౌకర్యం కల్పిస్తారని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హతల ధృవపత్రాల ప్రతులతో జాబ్ మేళాకు హాజరుకావాలని సూచించారు.


