బతికుండగానే ‘చంపేసి’ కోట్లు దోచేశారు!
భద్రాచలం ఎల్ ఐసీ శాఖలో రూ. 1.52 కోట్ల ఘరానా మోసం
39 పాలసీదారుల పేరిట నకిలీ మరణ క్లెయిమ్లు
బతికున్న వారికే డెత్ సర్టిఫికెట్లు సృష్టి
అంతర్గత తనిఖీలో బయటపడిన అక్రమాలు
పోలీసులకు ఫిర్యాదు… కేసు నమోదు
అధికారుల పాత్రపై పెరుగుతున్న అనుమానాలు
అశ్వాపురం ఏజెంట్లపై ఆరోపణలు
కాకతీయ, కొత్తగూడెం/ మణుగూరు/భద్రాచలం : సీతారామచంద్రస్వామి క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం పట్టణంలో భారీ బీమా మోసం వెలుగులోకి వచ్చింది. భద్రాచలం బీమా శాఖ పరిధిలో రూ. 1 కోటి 52 లక్షల మేర అక్రమంగా క్లెయిమ్లు పొందిన ఘరానా వ్యవహారం సంచలనం సృష్టించింది. అశ్వాపురం మండలానికి చెందిన ఇద్దరు ఏజెంట్లు 39 మంది పాలసీదారుల పేరిట నకిలీ పత్రాలు సృష్టించి, మరణించినట్లు చూపించి భారీగా సొమ్ము దోచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దర్యాప్తు ప్రాథమిక వివరాల ప్రకారం, సీతారాంపురం గ్రామానికి చెందిన ఇద్దరు ఏజెంట్లు ముందుగా కొంతమంది పేర్లపై పాలసీలు జారీ చేయించారు. అనంతరం వారిలో కొందరు మరణించారంటూ నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు సమర్పించి క్లెయిమ్లు పొందారు. కొన్ని సందర్భాల్లో అసలు పాలసీదారులు బ్రతికే ఉండగా, వారిని చనిపోయినట్లుగా చూపించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకా షాకింగ్ అంశమేమిటంటే, మరణించిన వారి పేర్లపై కూడా కిస్తీలు కట్టినట్లుగా చూపించి, తరువాత క్లెయిమ్లను పొందినట్లు సమాచారం. ఇలా మొత్తం రూ. 1.52 కోట్ల మేర అక్రమ లావాదేవీలు జరిగాయని అంతర్గత లెక్కలు సూచిస్తున్నాయి.
అంతర్గత తనిఖీలో బయటపడిన గుట్టు
అక్రమాలపై అనుమానం వచ్చిన ఉన్నతాధికారులు నేరుగా కొంతమంది పాలసీదారులను సంప్రదించారు. అప్పుడే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చనిపోయారంటూ క్లెయిమ్ తీసుకున్న వ్యక్తులు బ్రతికే ఉన్నారని తేలడంతో శాఖ మేనేజర్ చక్రవర్తి భద్రాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇద్దరు ఏజెంట్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నకిలీ పత్రాలు ఎక్కడ తయారయ్యాయి? మరణ ధ్రువీకరణ పత్రాలు ఎలా మంజూరయ్యాయి? ఇందులో మరెవరైనా సిబ్బంది ప్రమేయం ఉందా? అనే కోణాల్లో విచారణ సాగుతోంది.

అధికారుల పాత్రపై అనుమానాలు..!
ఇంత పెద్ద మొత్తంలో క్లెయిమ్లు మంజూరు అవుతున్నా శాఖ స్థాయిలో ఎవరూ గమనించలేదా అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. సాధారణ ప్రజలకు క్లెయిమ్ రావాలంటే నెలల తరబడి పరిశీలనలు జరిగే పరిస్థితుల్లో, ఇక్కడ నకిలీ పత్రాలు ఎలా ఆమోదించబడ్డాయన్నది అనుమానాస్పదంగా మారింది. బ్రాంచ్ అధికారుల సహకారం లేకుండా ఇంత భారీ స్కామ్ సాధ్యమేనా? మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసిన అధికారుల బాధ్యత ఏమిటి? ధృవీకరణ ప్రక్రియలో ఎలాంటి లోపాలు చోటుచేసుకున్నాయి? అనే అంశాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. భద్రాచలం శాఖ పరిధిలో ఇలాంటి ఘటన వెలుగులోకి రావడంతో పాలసీదారుల్లో ఆందోళన మొదలైంది. తమ సొమ్ము భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీమా సంస్థలపై ప్రజలు ఉంచిన విశ్వాసానికి ఈ ఘటన దెబ్బతీసిందని స్థానికులు అంటున్నారు.
దర్యాప్తు ఆరంభం..!
ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో ఉంది. నకిలీ పత్రాల సృష్టి, క్లెయిమ్ ఆమోదం, నిధుల విడుదల వరకు మొత్తం వ్యవహారాన్ని పోలీసులు సూక్ష్మంగా పరిశీలిస్తున్నారు. మరిన్ని పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశముందని సమాచారం. సామాన్యుల సొమ్ముకు భద్రత కల్పించాల్సిన సంస్థలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది. దర్యాప్తు పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ, ఈ ఘటన బీమా వ్యవస్థలోని లోపాలపై గట్టిగా ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇకనుంచైనా పర్యవేక్షణ కట్టుదిట్టమవుతుందా? లేక ఇది కూడా కాలక్రమేణా మరుగునపడుతుందా? అన్నది వేచి చూడాల్సిందే.


