డంపింగ్ యార్డు పొగతో ప్రమాదంలో ప్రజారోగ్యం
చెత్త దహనంతో గ్రామమంతా విషపూరిత పొగలు
గ్రీవెన్స్లో కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్కు వినతి
డంపింగ్ యార్డు తరలించాలంటూ గ్రామస్తుల డిమాండ్
కాకతీయ, హనుమకొండ : మడికొండ గ్రామ పరిధిలో కొనసాగుతున్న డంపింగ్ యార్డు స్థానికులకు శాపంగా మారింది. యార్డు వద్ద తరచూ చెత్తను కాల్చడంతో భారీగా పొగలు వెలువడి గ్రామమంతా వ్యాపిస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషపూరిత పొగల కారణంగా చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు శ్వాసకోశ సమస్యలు, కళ్ల మంటలు, దగ్గు, అలర్జీలతో బాధపడుతున్నారని తెలిపారు. డంపింగ్ యార్డు నుంచి వచ్చే దుర్వాసన రాత్రివేళల్లో మరింత ఎక్కువగా వ్యాపిస్తోందని, దీంతో ప్రజలు నిద్రపోవడానికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు కూడా అస్వస్థతకు గురవుతున్నారని తెలిపారు. పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారిన ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బాధితులు హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ను గ్రీవెన్స్ కార్యక్రమంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. డంపింగ్ యార్డులో చెత్త దహనాన్ని వెంటనే నిలిపివేయాలని, శాస్త్రీయ పద్ధతుల్లో చెత్త నిర్వహణ చేపట్టాలని కోరారు. అలాగే డంపింగ్ యార్డును జనావాసాలకు దూరంగా తరలించాలన్నా, ఆధునిక సాంకేతిక విధానాలతో శుద్ధి కేంద్రంగా అభివృద్ధి చేయాలన్నా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమస్యపై స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దెల ఎర్రగట్టు స్వామి, పెండ్లి కృష్ణమూర్తి, తొట్ల రాజు, పొనగోటి వెంకట్ రావు, కొలిపాక ప్రకాష్, కనక స్వామి, బిల్ల రవీందర్, తక్కెళ్ళపల్లి నిఖిల్ రావు, దువ్వ విజయ్, పెద్ది సత్యనారాయణ, దువ్వ సాంబరాజు, చట్ల అజయ్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికే వరకు పోరాటం కొనసాగిస్తామని గ్రామస్తులు స్పష్టం చేశారు.


